పార్ట్-15
రైల్వే ట్రాక్ను దాటడానికి తలపెట్టిన ఓవర్ బ్రిడ్జి పూర్తి కావొస్తుంది. అది దాటితే ఘట్కేసర్. ఘట్కేసర్ వచ్చేస్తే సిటీలో పడ్డట్లే. భద్రతా సిబ్బంది కాస్తా ఊపరి పీల్చుకుంటుంది. వేళ కాని వేళలో ఈ ప్రయాణం కట్టాల్సి వచ్చినందుకు వారి గుండెల్లో గుబులుగానే ఉంది. చాలా మరణాలకు సాక్షిగా నిలిచిన బోనగిరి ఖిల్లా నల్లటి దయ్యంలా నిలబడి ఉంది. హైదరాబాద్ నుంచి వెళ్తుంటే ఘట్కేసర్ ఓవర్ బ్రిడ్జి దాటినప్పుటి నుంచి మన కళ్లతో ఖిల్లా దోబూచులాట ఆడుతూనే ఉంటుంది. దాని శిఖరాన్ని కళ్లతో పట్టుకుంటూ బోనగిరి చేరుకోవడం ఓ ఆటలా, సరదా వుంటుంది. బహుశా మంత్రి విజయేందర్ రెడ్డికి కూడ ఆ సరదా వుండి వుంటుంది. కానీ ఇప్పుడు దాన్ని దాటేసి వస్తున్నాడు. ఆ సరదాకు స్థానం లేదు. విజయేందర్ రెడ్డి విద్యార్థి జీవితం, రాజకీయ జీవితం ప్రారంభమైంది ఆ ఖిల్లా కిందనే. మంత్రి వర్గంలో ముఖ్యమంత్రి తర్వాతి స్థానం అతనిదే. అంటే నెంబర్ టూ.
ఎవరితోనూ ఆయనకు శత్రుత్వం లేదు. అయితే నల్లగొండ జిల్లాలో ఆధిపత్యం కోసం మాత్రం ఆయన పార్టీలోని మరో నాయకుడు మాత్రం నిరంతరం పోటీ పడుతుండేవాడు. విజయేందర్ రెడ్డికి ఉన్న కలుపుగోలుతనం, మృదుస్వభావం ఆయనకు లేకపోవడంతో అది సాధ్యమయ్యేది కాదు. ఆయన పోటీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా విజయేందర్ రెడ్డి నవ్వుతూ కొట్టిపారేసేవాడు. బోనగిరి పాఠశాలలో, కళాశాలలో తనతో పాటు చదువుకున్న పాత మిత్రుల్ని ఎవర్నీ ఆయన మరిచిపోలేదు. సిద్ధాంత నిబద్ధతలు కూడా ఆయనకు పట్టేవి కావు. ఆయన సహాధ్యాయులు చాలా మంది మంచి రైటర్స్ ఎదిగారు. వీరు సహజంగానే లెఫ్ట్ సింపతైజర్స్. అయినా వారితో కలవడానికి, వారితో మాట్లాడడానికి గానీ విజయేందర్ రెడ్డి ఎన్నడూ వెనుకాడలేదు.
గత ముఖ్యమంత్రి కాలంలో కూడా ఆయన హోం మంత్రిగా పని చేశాడు. రాష్ట్రంలో హోం మంత్రిత్వ శాఖ మెడ మీద కత్తి వంటిది. నక్సలిజం పెరిగిపోయి అంతటా వెళ్లూనుకుంటున్న తరుణంలో, పౌరహక్కుల సంఘం బలంగా ఉన్న కాలంలో ఆ శాఖను నిర్వహించడం ఆషామాషీ కాదు.
జాతీయ పార్టీ అధికారం కోల్పోయి ప్రాంతీయ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అదే ప్రథమం. ఆ జాతీయ పార్టీని తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ముందుకు తెచ్చి ఓడించిన అధినాయకుడే ఆ ముఖ్యమంత్రి. ఆయన మాటకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తిరుగుండేది కాదు. ఆయన వద్ద హోం శాఖనే కాదు, ఏ శాఖను నిర్వహించినా ఒకటే.
ఆ కాలంలోనే ఓ సంచలనం. కనీవినీ ఎరుగని సంచలనం. రాష్ట్రంలో నక్సలైట్లు కిడ్నాప్నకు పాల్పడిన తొలి సంఘటన ఇదే. అందుకే అంత సంచలనం. నిజామాబాద్ జిల్లాలోని ఒక మండలాధ్యక్షుడ్ని నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. పొద్దున జరిగిన ఈ కిడ్నాప్ వార్త సాయంత్రానికి రాష్ట్రమంతటా, దేశమంతటా పాకిపోయింది. రవీంద్రభారతిలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన హోం మంత్రి విజయేందర్ రెడ్డిని విలేకరులు చుట్టుముట్టారు.
జైళ్లలో ఉన్న తమ సహచరుల పేర్లను కొన్నింటిని ఇచ్చి వారిని వదిలేస్తే మండలాధ్యక్షుడ్ని వదిలేస్తామని, లేకపోతే చంపేస్తామని 24 గంటల గడువు ఇస్తూ నక్సలైట్లు హెచ్చరిక చేశారు.
ఇంత ప్రాముఖ్యం గల సంఘటన గురించి ఏ మాత్రం పొల్లుగా మాట్లాడినా ఎంత రాద్ధాంతం అవుతుందో విజయేందర్రెడ్డికి తెలుసు. పైగా ముఖ్యమంత్రి సామాన్యుడు కాడు. ఏం మాట్లాడినా పీక పట్టుకుంటాడు. అందుకే ఆయన విలేకరుల వద్ద ఏం చెప్పలేకపోయాడు. విలేకరులు వదిలిపెట్టలేదు.
''నాకు ఇప్పుడే తెలిసింది. ఏం జరిగిందే కనుక్కుంటే తప్ప నేను ఏమీ చెప్పలేను. ప్లీజ్ ఒత్తిడి చేయవద్దు'' అని చెప్పి విజయేందర్ రెడ్డి అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లిపోయాడు.
ముఖ్యమంత్రి సినిమా ఫీల్డ్ నుంచి వచ్చినవాడు. ఆయనకు కింది స్థాయి పరిస్థితులేమిటో పెద్దగా తెలియదు. అంతేకాకుండా తెలంగాణలోని పరిస్థితులు ఏ మాత్రం తెలియవు. కిడ్నాప్ వ్యవహారాన్ని చాలా సున్నితంగా పరిష్కరిస్తే తప్ప బయట పడలేమని ఆయనకు తెలుసు కానీ ముఖ్యమంత్రి వింటాడా? వింటాడనే నమ్మకం లేదు. ఆయన ఎవరి మాట వినడు. తనకు తోచిందే కరెక్టు అనుకుంటాడు.
విజయేందర్ రెడ్డికి బాధగా ఉంది. తానేమీ చేయలేనని తనకు తెలుసు. ఈ పదవి అలంకారం మాత్రమే అని కూడా తెలుసు. కారులో వెళ్తుంటే గతంలో జరిగిన అవమానం గుర్తొచ్చింది. విలేకరులు ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అయి బయటకు వస్తున్నాడు. వారికి విజయేందర్ రెడ్డి ఎదురయ్యాడు.
విలేకరులు చెప్పింది విని విజయేందర్ రెడ్డి అవాక్కయ్యాడు. ఆయన ముఖం వివర్ణమైంది. తన శాఖకు సంబంధించిన ఇంత ముఖ్యమైన విషయాన్ని తాను లేకుండా ప్రకటించడం ఆయనకు తలకొట్టేసినట్లనిపించింది. ఓ ప్రముఖ దినపత్రిక విలేకరి తన స్థితిని చూసి నవ్వుతున్నట్లనిపించింది. వెనుదిరిగిపోదామనుకున్నాడు. ఇంతలో ముఖ్యమంత్రి స్వరం కంగుమని మోగింది.