కవుల పుట్టిల్లు ఆగ్రా
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు, భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి మధ్య ఆగ్రాలో శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. కాశ్మీర్ కొలిమి రగులుతున్న దృష్ట్యా ఈ సదస్సుకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. ప్రపంచం యావత్తూ ఆసక్తిగా గమనిస్తోంది. తాజ్మహల్ అందాలతో విలసిల్లే ఆగ్రా నగరం ఉభయ దేశాల కవులకు కూడా ఎంతో ప్రాణపదమైంది. ఎందరో కవులకు ఈ నగరం ప్రేరణగా మారింది. వారి సృజనశీలతకు జవజీవాలు పోసింది. ప్రపంచ ప్రజలు ఆరాధించే మీర్జా గాలిబ్ ఆగ్రాకు చెందినవాడే. గాలిబ్తో పాటు ముగ్గురు ఉర్దూ, పర్షియన్ కవులకు స్ఫూర్తి ప్రదాత ఈ నగరం.
మీర్ తఖీ అన్వర్, నజీర్ అక్బరాబాదీలు ఈ నగరం గడ్డ మీద కవితాగానం చేసినవారే. మీర్ తఖీ మీర్ 1723లో ఆగ్రాలో జన్మించాడు. తండ్రి మిమ్ మహ్మద్ అలీ సూఫీ సన్యాసి. ఆయన ఆధ్యాత్మిక చింతన, సూపీ ప్రేమ తత్వం తఖీ మీర్ కవిత్వంలో అద్భుతంగా ప్రతిఫలించింది.
మరో ప్రముఖ కవి నజీర్- నజ్మ్లకు ఆద్యుడు. ఆయన నజ్మ్లు మావన జీవితంలోని అన్ని పార్శ్వాలను స్పశించాయి. ఆయన ఢిల్లిలో పుట్టి అహ్మద్ షా అబ్దాలి దాడుల కాలంలో ఆగ్రాకు వచ్చాడు. అందుకే ఆయన అక్బరాబాదీ అయ్యాడు. ఆయన కవిత్వాన్ని భారత, పాక్ ఉభయ దేశాల్లో చాలా ఇష్టంగా చదువుతారు. మత సామరస్యాన్ని బోధించిన ఆయన కవిత్వంపై పాకిస్థాన్లో పరిశోధనలు జరుగుతున్నాయి.
నజీర్ ఆగ్రా నగరాన్ని ప్రాణప్రదంగా ప్రేమించాడు. ఆయన ఆగ్రాను ఏ స్థితిలోనూ వదిలి పెట్టలేదు. రాజు ఆహ్వానం మేరకు ఒకసారి ఆయన ఆగ్రా వదలిపెట్టాల్సి వచ్చింది. ఆగ్రా నుంచి బయలుదేరిన నజీర్ పదే పదే వెనక్కి తిరిగి తాజ్ మహల్ను చూస్తూ పోయాడు. అలా కొంత దూరం వెళ్లాక తాజ్ మహల్ కనిపించలేదు. వెంటనే వెనక్కి తిరిగి వచ్చాడు. అందుకే ఆయన ఒక్కసారి ఇలా అన్నాడు-
ఆశిక్ కహో అసిర్ కహో ఆగ్రే కా హై
ముల్లా కహో దబీర్ కహో ఆగ్రే కా హై
ముఫ్లిస్ కహో ఫకీర్ కహో ఆగ్రే కా హై
సాయర్ కహో నజీర్ కహో ఆగ్రే కా హై
(నన్ను ప్రేమికుడిని అనండి, బందీని అనండి, నేను ఆగ్రావాడినే; ప్రబోధకుడ్ని అనండి, రాతగాడిని అనండి, నేను ఆగ్రా వాడినే; నిరుద్యోగిని అనండి, పిచ్చివాడిని అనండి, నేను ఆగ్రావాడినే; కవిని అనండి, కాకపోతే నజీర్ను అనండి; నేను మాత్రం ఆగ్రావాడినే) ఆగ్రాతో నజీర్ అనుబంధం ఇంతగా పెనవేసుకుపోయింది.
గాలిబ్గా చిరపరిచతుడైన అసదుల్లా బేగ్ ఖాన్ ఆగ్రాలోనే జన్మించాడు. ఉర్దూ కవిత్వాన్ని గాలిబ్ ఒక మలుపు తిప్పాడు. ఈ కింది కవిత పాదాలు ఆయన గొప్పదనాన్ని తెలియజేస్తాయి.
యున్ తో హై దునియా మే సుఖ్న్వర్ బహుత్ అచ్చే
పర్ గాలిబ్ కా కెహ్తె హై అందాజ్-ఎన్-బయాన్ ఔర్
(ప్రపంచంలో అద్భుతమైన కవులెందరో వున్నారు. కానీ వారందరిలోకి గాలిబ్ శైలి విశిష్టమైంది) అక్బరాబాద్లో, అదే నేటి ఆగ్రాలో 1947 దేశ విభజన గురించి ఎంతో మంది కవులు కవిత్వం రాశారు. చాలా మంది పాకిస్థాన్లో స్థిరపడ్డారు. అందులో సీమన్ అక్బరాబాదీ, సాబా అక్బరాబాదీ ప్రధానులు.












Click it and Unblock the Notifications
