ఆర్తి - అస్తిత్వం


(ప్రముఖ కవి బైరెడ్డి ఆర్తి మూడో కవితా సంకలనం వెలువడింది. ఆయన గత రెండు సంకలనాలను కూడా ఆర్తి పేరుతోనే ప్రచురించారు. మూడో ఆర్తికి ప్రముఖ సాహిత్య విమర్శకుడు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ముందుమాట రాశారు. ఆ ముందు మాటలోని కొంత భాగాన్ని ఇక్కడ ఇస్తున్నాం.)

బైరెడ్డి కృష్ణారెడ్డి కవితల్ని లోతుగా పరిశీలిస్తే ఇతనిలో అస్తిత్వ వాద ఛాయలు కనిపిస్తవి. అస్తిత్వవాదం ఏమంటుందో చూద్దాం. ఆధునికతలో భాగంగా వచ్చింది అస్తిత్వవాదం. కిర్క్ గార్డ్, హెడెగ్గర్, సార్త్రేలాంటి వాళ్లు ఈ వాద ప్రతిపాదకులు. అల్బర్ట్ కామూ, కాఫ్కాలాంటి వాళ్లు ఈ వాద రచయితలు. పాత ఫ్యూడల్ రాజ్యం, కొత్తగా వచ్చిన పెట్టుబడిదారీ రాజ్యం, మతం, సంప్రదాయాలు, కట్టుబాట్లు, నియమాలు - ఇవన్నీ మనిషిని, మనిషి వ్యక్తిత్వాన్ని ఛిద్రం చేస్తున్నవి. మనిషిని సహజంగా బతకనివ్వడం లేదు. మనుషుల కలయికలను యాంత్రికం చేస్తున్నవి. ఒంటరిని చేస్తున్నవి. విల్ (ఇచ్ఛ) ప్రకారం బతకనివ్వడం లేదు. జీవితం అర్థ రాహిత్యమవుతున్నది. అసంబద్దమవుతున్నది. కనుక మనిషికి భవిష్యత్తు లేదు. ప్రేమ లేదు. అనుభూతి లేదు. కాబట్టి మృత్యువే అంతిమం. నాట్ ఎ ఫిజికల్ డెత్. అదువల్ల మనిషి బీయింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ గా అంతర్ముఖుడవుతున్నాడు. మొత్తంగా ప్రపంచానికీ, మనిషికీ మధ్య ఘర్షణగా అస్తిత్వవాదం కనిపిస్తున్నది.

తెలుగులో అస్తిత్వ వాదాన్ని చిత్రించిన నవలా రచయితలు చాలా మందే ఉన్నారు. కవులు తక్కువ. వేగుంట, సీతారాం, ఎం.ఎస్. నాయుడు, శ్రీకాంత్, సైదాచారి, కాశీభట్ల వేణుగోపాల్, రమణజీవి లాంటి పేర్లను ఈ సందర్భంగా పేర్కొనవచ్చు. ఈ సంకలనానికే పరిమితం కాకుండా ఇతని మొత్తం కవిత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రేమ కవితలు, మృత్యు స్పృహతో రాసిన కవితలు, ఇంకా తన లోపలికి వెళ్లి రాసిన కవితలు, తన ఉనికి అదృశ్యం కావడానికి సంబంధించిన లోపలి వ్యధ, ఇవన్ని ఇతన్ని ఎగ్జిస్టెన్షియలిస్టుల కోవలోకి చేరుస్తున్నవి.

స్త్రీ, దళిత, ముస్లిం, తెలంగాణావాదాలను అస్తిత్వవాద ఉద్యమాలంటున్నరు. కాని అస్తిత్వవాదం అసలు తత్వాన్ని విస్తృతపరిస్తేనే ఇవి అస్తిత్వవాదాలవుతాయి. అట్లా చూసినప్పుడు తన (తెలంగాణా) భాష, సంస్కృతి, తన నేల, వనరులు అదృశ్యం కావడం పట్ల వ్యధ చెందుతూ కృష్ణారెడ్డి రాసిన మూడు పాటలు, ఏమున్నది, తుడుం, సమాయత్తం లాంటి కవితలు తెలంగాణ అస్తిత్వవాద కవితలు.

స్థూలంగా విశ్లేషిస్తే - దండు, వూరు జాడ, ఏమున్నది, తుడుం, నిర్ఘాంతం, అసలేంది నీ గొడవసలు, సమాయత్తం, టు ద సెకండ్ పర్సన్ నాట్ సింగ్యులర్, గురివింద, అంతరాత్మసాక్షి, ఇమ్మార్టల్ వెంకటేష్, సునామీ నైతికం, పహరా, ఎపిటాఫ్, జల్లెడ మనిషి లోపల్నించి బయటకు, బయటి నుంచి లోపలికి బాహిరాన్ని చెప్పే కవితలు. మగత, నిష్కృతి, నాణానికి మరోవేపు, ఉనికి, స్పర్శ, అనంత భ్రమణం, పార్శ్వాలు, శోధన, క్రీనీడ - ఇవి అంతరాన్ని చెప్పే కవితలు. నిజానికి విభజన రేఖ గీయడం కుదరదు. మరీ ముఖ్యంగా కృష్ణారెడ్డి విషయంలో అసలే కుదరదు.

కృష్ణారెడ్డి ఇమోషనల్ గా మాట్లాడినప్పుడు, రాసినప్పుడు మ్యూజిక్ ఉంటుంది. ఇమోషనల్ గా కాకుండా మాట్లాడినప్పుడు, రాసినప్పుడు లాజిక్ ఉంటుంది. ఒకటి కవిత్వ లక్షణమైతే, రెండవది తాత్వికుని లక్షణం.

దర్శనాత్ వర్ణనాచ్ఛాథ రూఢా లోకే కవిశ్రుతి - భట్ట తౌతుడు

No man was ever yet a great poet without being at the same time a profound philosopher - S T Coleridge

నిజానికి ఇమోషనల్, లాజిక్ ఒక దగ్గర పొసగవు. ఒక దగ్గర పొసగడం ఒక మ్యూజిక్. ఈ రెండు కృష్ణారెడ్డిలో పొసిగినయ్. వీని కవిత్వంలో సంగమించినయ్. He is a poet of magic.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+