పొద్దుపొడుపుల ముఖం
మనసు పొరల్లోకి ఇంకుతయి'
నల్లగొండ జిల్లా తెలంగాణ చిత్రపటం మీద పూస్తున్న ఎర్రటి పూల మోదుగుచెట్ల వనం ఆరాట పోరాటాలు, ఆశానిరాశలు, సందేహాలూ, సమాధానాలూ - భౌతిక బౌద్ధిక సంఘర్షణలకు మూలకేంద్రం, సృజనాత్మక ప్రక్రియయలకూ, సైద్ధాంతిక చర్చోపచర్చలకు చాలాకాలంగా నల్గొండ జిల్లా ప్రధాన క్షేత్రమైంది. పీడిత ప్రజలు గుండెకు గొంతుకనిచ్చిన గూడ అంజయ్య పాట 'ఊరుమనదిరో...' పుట్టింది నల్లగొండ నడిబొడ్డులోనే. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జీవితాన్ని త్యాగం చేసిన చెరబండరాజు నల్లగొండవాడే. ఆరుగురు దిగంబర కవుల్లో ఇద్దరు నల్లగొండ జిల్లావారే. ఇదంతా యాదృశ్ఛికమే కావచ్చు గానీ నల్లగొండ జిల్లా మేదావుల, ప్రజల నిరంతర చింతనకు, కొత్త తొవ్వ కోసం దేవులాటకు ఇది అద్దంపడుతుంది. తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనూ, తదనంతర కాలంలోనూ ప్రజారాజకీయాలకు నల్లగొండ ప్రధానక్షేత్రంగానే వుంది.
రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బి.యన్.రెడ్డి, నల్లా నర్సింహులు, యాదగిరి, తిరునగిరి ఒక్కరేమిటి - ఊరూరా ఒకవీరుడు పుట్టి తెలంగాణను రణభూమిగా మార్చారు. తెలంగాణ సాయుధ పోరాటవీరుల త్యాగాల ఫలితంగా ఇక్కడి ఫ్యూడల్ వ్యవస్థ కీళ్లు కదిలినై. తర్వాత ఆ కీళ్లు విరిచే పని ప్రధానంగా ఉత్తర తెలంగాణాలో కరీంనగర్ జిల్లాలో జరిగింది.
నల్లగొండ జిల్లా భౌగోళిక స్వరూపమే విచిత్రంగా ఉంటుంది. ఒకవైపు కృషానది గుంటూరును వేరుచేస్తూ కలుపుతూ వుంటుంది. మరోవైపు కృష్ణాజిల్లా సరిహద్దు. ఈ విధంగా బ్రిటీషాంధ్ర సమాజం సాంగత్యం కొంత, ఒకవైపు చుక్క నీటి కోసం నోరు తెరిచే కుష్కీనేల, మరోవైపు కాస్తో కూస్తో కాల్వ నీళ్లు పారి పంటలు పండే నేల. అందుకేనేమో, మొదటిసారి తెలంగాణ రాష్ట్రసమితి స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగినప్పుడు వరంగల్ జిల్లా చేర్యాల నుంచి మొదలుపెడితే బోనగిరి వరకు స్వీప్ చేసింది. మరో పార్టీకి స్థానం లేకుండా చేసింది. ఈ వైరుధ్యం బహుశా బౌద్ధిక క్షేత్రంలోనూ కనిపిస్తుందేమో. ఈ పరిణామాన్ని పరిశీలిస్తే తెలంగాణాలోనే కాదు, యావత్ తెలుగు సమాజంలో ఆలోచనాపరంగా నల్లగొండ జిల్లా ముందుంది.
మొత్తం, తెలుగు సృజనాత్మక సాహిత్యం సారాన్ని మార్చిన ఘనత నల్లగొండ జిల్లాకు దక్కుతుంది. వివిధ సిద్ధాంతాలు, ఆలోచనలు నిరంతరం ఇక్కడ సంఘర్షించుకుంటాయి. కొట్లాడతయి వాటి నుంచి సాహిత్యం నిప్పుల గుండాలను రాజేసింది. ఆ నిప్పులోంచే వర్తమాన సాహిత్య, సామాజిక సిద్ధాంతాలకు చేర్పులు, మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితిని నల్లగొండ జిల్లా కవులు, రచయితలు, విమర్శకులు కల్పించడలిగారు. తెంపులేకుండా రగలడం ఈ నేల స్వభావం.
అందువల్లనే 'తోవ ఎక్కడ?'' అనే చింతనా ప్రపంచం విస్తరిల్లింది. ప్రజా రాజకీయాలు గమ్యం చేర్చలేవనే సంఘర్షణ మొదలైన ప్రతిసారీ ఆ అన్వేషణ ప్రతిఫలనాలు సాహిత్యంలోసామాజిక రంగంలో వ్యక్తమవుతూ వస్తున్నై. అవి తల్లిని పిల్లలు వేసే ప్రశ్నలుగా ముందుకొచ్చినై. ఈ సంఘర్షణలో మంచిదనే భావించే వైపు ఉందడానికి కూడా ఈ జిల్లా బుద్ధిజీవులు వెనకాడలేదు. తెలంగాణ ఆంధ్ర మహాసభకు దిశను, దశను నిర్దేశించడంలో గానీ, దిగంబర కవుల్లోని ఇద్దరు తర్వాత విప్లవోద్యంలో భాగం కావడం గానీ, ఆ తర్వాత దళిత బహుజన సాహిత్యానికి తొవ్వలు వేయడం గానీ, తెలంగాణ రాజకీయ, సాహిత్య, సామాజిక అస్తిత్వ ఉద్యమానికి పునాదులు వేయడం గానీ ఇందులో భాగమే.
ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకు సాగవలసిన నూత్న సందర్భాన్ని కల్పిచడంలో ప్రధానపాత్ర పోషించింది నల్లగొండ జిల్లానే, దానివల్ల అనేక నిందలు, రహస్య దాడులు మోయవలసి వచ్చింది. అందుక నెపాన్ని ఎవరి మీదో నెట్టేందుకు కూడా మేం సిద్ధంగా లేం. దాన్ని మా వ్యక్తిగత సమస్యగానే, సంక్షోభంగానే తీసుకుంటూ అడుగులేయడం నేర్చుకొన్నం అనుభవం నుంచి పాఠాలనునేర్చుకొనే ప్రయత్నం చేస్తున్నం.
-
కాసుల
ప్రతాపరెడ్డి
(కర్ర
ఎల్లారెడ్డి
మన
తెలంగాణ
నల్లగొండ
జిల్లా
ప్రత్యేక
సంచికకు
రాసిన
అతిథి
సంపాదకీయం)