అమ్మంగి వేణుగోపాల్కు కాళోజీ పురస్కారం
హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త అమ్మంగి వేణుగోపాల్ను కాళోజీ స్మారక పురస్కారం వరించింది. ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వం మంగళవారంనాడు ప్రకటించింది. కాళోజీ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9వ తేదీన ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
తెలంగాణ భాష, సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసినవారికి తొలిసారిగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పేరుతో ఈ స్మారక పురస్కారాన్ని అందిస్తోంది. అదే విధంగా కాళోజీ జయంతిని పురస్కరించుకుని బుధవారంనాడు తెలంగాణ భాషా దినోత్సవాన్ని తెలంగాణ ప్ఱభుత్వం ప్రకటించింది.
కాళోజీ స్మారక అవార్డును పొందిన అమ్మంగి వేణుగోపాల్ పచ్చబొట్టు - పటంచెరువు, భరోసా, మిణుగురు అనే కవితా సంపుటాలను వెలువరించారు. అమ్మంగి నాటకాలు కూడా గ్రంథంగా వచ్చాయి. సాహిత్య విమర్శలో ఆయన విశేష కృషి చేశారు. అవినాభావం, సాహిత్య సందర్భం - సమకాలీన స్పందన, వట్టికోట ఆళ్వారుస్వామి రచనలు - ఒక పరిశీలన అనే వ్యాస సంకలనాలను వెలువరించారు. నవలా రచయితగా గోపీచంద్ అనే పరిశోధనా గ్రంథానికి ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు.
సాహిత్య అకాడమీ అడ్వయిజరీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఏడు గ్రంథాలకు ఆయన సంపాదకత్వం వహించారు. పది కథానికలు కూడా రాశారు. ఆయన సాహిత్యంపై సూర్యప్రకాష్ రావు అమ్మంగి వేణుగోపాల్ సాహిత్యం - ఒక పరిశీలన అనే పేరు మీద పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు.
అమ్మంగి వేణుగోపాల్ 1948 జనవరి 20వ తేదీన ఇప్పటి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం ఆలంపల్లి గ్రామంలో జన్మించారు. మెదక్ జిల్లా జహీరాబాద్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా ఆయన 2004లో పదవీ విరమణ చేశారు.