సాహితి: అనగనగా ఒక కథ
హైదరాబాద్: ‘మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం' రెండవ రోజు అతి తక్కువ ఆర్భాటంతో, మరింత ఎక్కువ యువ సాహితీవేత్తల సాహిత్య ప్రసంగాలతో జోరు అందుకుంది. సోమవారంనాడు నిర్ణీత సమయం అయిన ఐదు గంటలకే సభా ప్రాంగణం సుమారు 600 మంది ప్రేక్షకులతో నిండిపోయి నిన్నటి తొలి రోజు సభా విజయానికి తార్కాణంగా నిలిచింది. ఈ రెండవ రోజు కూడా సాంప్రదాయాన్ని పాటిస్తూ సుప్రసిద్ద గాయకులూ శ్రీ జి.వి. ప్రభాకర్ సంస్థాపించిన ఎస్.ఎస్. మ్యూజిక్ ఎకాడెమీ వారి యువ గాయనీగాయక బృందం అతి శ్రావ్యంగా వైవిధ్యభరితమైన లలిత సంగీతాలు ఆలపించారు.
ఆ తరువాత లాంఛనప్రాయంగా జరిగిన ప్రారంభ సభకి ఆచార్య కొలకలూరి ఇనాక్, డా. కవితా ప్రసాద్ గారు, డా. ద్వానా శాస్త్రి గారు, వంశీ రామరాజు , వంగూరి చిట్టెన్ రాజు పాల్గొని సముచితమైన స్ఫూర్తి ప్రసంగాలు అతి క్లుప్తంగా చేశారు. తరువాత 12 మంది యువ కవయిత్రులతో జరిగిన ‘యువతీ కవి సమ్మేళనం' లో మోహిత కౌండిన్య, మెర్సి మార్గరెట్, తేజస్వి ల స్వీయ కవితలు ఆకట్టుకోగా, బెంగుళూరు నుంచి వచ్చి, అంధురాలైన స్వాతి బ్రెయిలీ లిపిలో వ్రాసుకుని వచ్చి, ఆ లిపి సహాయంతో చదివిన కవిత, చిరునవ్వుతో ఆహ్లాదంగా చదివిన తీరు ప్రత్యేక ప్రశంసలకి నోచుకుంది.
15 మంది యువ వక్తలతో ‘అనగనగా ఒక కథ', శీర్షికతో కథకులు వినిపించిన తమ కథలలో ఎం. లలిత, జి. భారతి, వంశీ కృష్ణ మొదలైన వారి కథలూ, చదివిన విధానం శ్రీశ్రీ కవితని "ఏమున్నది ఏ స్త్రీ చరిత్ర చూసినా" అని తిరగ రాసి ఆ నేపధ్యంలో చదివిన కథ మొదలైనవి బాగానే ఉన్నా ఈ విభాగంలో ప్రసంగాలు కొంచెం పేలవంగానే ఉన్నాయి. కానీ లబ్ధ ప్రతిష్టులు పాల్గొన్న సభలతో పోల్చి చూస్తే పెద్ద తేడా ఏమీ లేదు.
ఈ రెండవ రోజు సభని కూడా గంగిశెట్టి లక్ష్మీ నారాయణల సమర్ధవంతంగా నిర్వహించారు. రేపటి నుండీ అక్టోబర్ 5 దాకా జరిగే ఈ మహా సభలకి ప్రతీ రోజూ సాయంత్రం 5 నుండి జరిగే ఈ యువ సాహితీ సభలకు అందరూ ఆహ్వానితులే.