బిఎస్ పాత్ర బహుముఖీనం: ఎస్వీ
హైదరాబాద్: సమకాలీన సమాజానికి దిక్సూచిగా మార్గనిర్దేశనం చేయడంలో సామాజిక తత్వవేత్త బిఎస్ రాములు పాత్ర బహుముఖీనమైనదని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఉదయం హైదరాబాదులోని బాగ్ అంబర్పేటలో గల రామకృష్ణ నగర్లోని విశాల సాహితి కార్యాలయం బిఎస్ రాములు 68వ జన్మదిన వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా జరిగిన సాహితీ గోష్టిలో బిఎస్ రాములు రచించిన 'దారి ఎటు?' పుస్తకాన్ని ఎస్వీ ఆవిష్కరించారు. బహుజన హితాయా, బహుజన సుఖాయ తారకమంత్రాన్ని సమాజానికి అందించిన సంఘ సంస్కర్త బుద్ధుడు, మహాత్మా ఫూలే, డాక్టర్ అంబేడ్కర్, భాగ్యరెడ్డి వర్మల సిద్ధాంత భావజాలాన్ని సమగ్రంగా సమాజానికి ఉపయోగపడే విధంగా అందించడంలో బిఎస్ రాములు దారి ఎటు పుస్తకం గొప్పగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు .
తెలంగాణ రాష్ట్ర విభాగాన్ని ముందు, తర్వాత వచ్చిన అత్యంత గొప్ప సామాజిక స్పృహ కలిగిన రచనల్లో దారి ఎటు పుస్తకం అగ్రభాగాన నిలపడుతుందని అన్నారు. బహుజనులు సంఘటనా శక్తిని ప్రదర్శించడంలో వెనకబడుతుండడం వల్ల సమాజంలో వివక్ష, అసమానతలు, అణచివేతలు కొనసాగుతున్నాయని, బహుజన ఏ విధంగా సంఘటితం కావాలో బిఎస్ తన రచనల్లో చైతన్యం ప్రబోధించడంలో నేటి రచయితలకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నారని అన్నారు.

బౌద్ధం, సోషలిజం, అంబేడ్కరిజం, ఫూలే ఇజం ఆవశ్యకతలను, అవసరాలను విశాల విస్తృతితో మూడు దశాబ్దాలుగా తన రచనలను ఎప్పటికప్పుడు గ్రంథాలుగా వెలువరిస్తూ బిఎస్ విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఆచార్య జయశంకర్ సార్ తరువాత తెలంగాణ భావజాల వ్యాప్తికి బిఎస్ క్రీయాశీలక పాత్ర పోషించారని చెప్పారు.
ఈ సందర్భంగా జహరిగిన బిఎస్ రాములు జన్మదిన వేడుకల్లో సాహితీ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్, నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు ఎడిటర్ డాక్టర్ పత్తిపాక మోహన్, ప్రముఖ సైన్స్ రచయిత కెబి గోపాలం, రాష్ట్ర ప్రాచ్యలిఖిత పరిశోధనాలయం పూర్వ సంచాలకులు ఎం. బాగయ్య, తెలంగాణ రచనల చెరువు అధ్యక్షుడు డాక్టర్ బెల్లంకొండ సంపత్ కుమార, తెలంగాణ సబ్బండ కళల సమాఖ్య చైర్మన్ తాండూరు గోపినాథ్, ప్రముఖ పరిశోధకులు డాక్టర్ ఎం. శ్రీకాంత్, పాలమూరు రచయితల సంఘం కార్యదర్శి గుడేలి సీనయ్య, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు విశాల సాహితి అకాడమీ కార్యదర్శి బేతి శ్యామల ఓ ప్రకటన విడుదల చేశారు.












Click it and Unblock the Notifications