కవి స్వరం: నందకిశోర్ కవిత
నందకిశోర్కు రాజకీయ కవిత్వమంటే ఇష్టమనుకుంటా. చాలా కాలంగా కవిసంగమం గ్రూప్లో కవితలు చదువుతున్న నాకు ఆ విధంగా అనిపించింది. రాజకీయ కవిత్వం రాయడం ఒక రకంగా సులభమై గానీ అందులో సాంద్రతను తేవడం, కళాత్మకంగా చెప్పడం కష్టమేమీ కాదు. కానీ చాలా రాజకీయ కవిత్వం నినాదప్రాయంగా వస్తూ వచనమై తేలిపోతుంది.
నందకిశోర్ అవుట్ ఆఫ్ సిలబస్ కవిత అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. నిజానికి, ఇది రాజకీయ కవితనేనా అనే అనుమానం కూడా కలుగుతుంది. నందకిశోర్ ఈ కవితను ఓ ట్రాన్స్లో రాసినట్లున్నాడు. ఈ కవితలో మూడు స్టాంజాలు ఉన్నాయి. అడవితో ప్రారంభమై మళ్లీ అడవితో ముగుస్తుందీ కవిత. అర్థం చేసుకోవడానికి కొంత కష్టమే, మనసు లగ్నం చేయాలి, పునశ్చరణ చేసుకోవాలి. పునశ్చరణ చేసుకోవడానికి, నెమరు వేసుకోవాడనికి తగినంత కళాత్మకతను, కవితా పరిమళాన్ని నందకిశోర్ దీనికి అద్దాడు.

పువ్వు, గాలి, మిణుగురు చేసే పనులను ఆయన చెప్పుకొచ్చాడు. తమ కర్తవ్యాలను నిర్వహించిన తర్వాత అవేమవుతాయి? ప్రతి సంధ్యలోనూ హృదయం చీల్చి పొమ్మని అడవి పదునైన కత్తి ఉంచిపోతుందని చెప్పడంలోని రాజకీయ అంతరార్థమేమిటి, దాని ఫలితాన్ని ఫలితాన్ని ఎలా చెప్పాడు అనేది ముఖ్యంగా మారింది. రాత్రికి ఎలాగూ నీ మరణం తప్పదని ముక్తాయింపు ఇవ్వడంలోని అర్థం ఏమిటనేది ఊహించుకోవాల్సింది. ఈ కవితను అనుభవించి పలవరించాల్సిందే..
-కాసుల ప్రతాపరెడ్డి
*out of syllabus*
అడవికి అంతే- చిగురించాలి. అల్లుకుపోవాలి.ఏదీ కనిపించనంత విస్తరించాలి.
చిమ్మచీకట్లో మిణుగురుకోసం ఎందుకు వెతుకుతావో అర్ధం కాదు. హత్తుకుంటది. జోలపాట రానందుకు బాధపడ్తది.
భయపడి నెగడు వేసుకుంటావా?! కోపం. పాత గుర్తులు దహించుకుపోవడం కొంచెం కూడా ఇష్టముండదు.
**
పువ్వుకి అంతే- వికసించాలి.సీతాకోకల్నిపోగుచేసి మధువు పంచాలి.రాలిపోవాలి.
దూరంగా నిల్చుని గాలి కోసం ఎదురుచూస్తావా?! అర్ధం కాదు. వేళ్ళతో తాకడం కూడా రాదంటూ నవ్వుకుంటది.
**
ప్రతీ రక్తసంధ్యలోనూ దేహాన్ని పరిచి,
హృదయం చీల్చిపొమ్మని ఒక పదునైన కత్తిని చేతిలో ఉంచుతుంది కదా అడవి పువ్వు?
నమ్మకు.నవ్వుతూ బతకడం సాధ్యమని చెప్పకు.ఆమెని దగ్గరికి తీసుకో. ఆపై చేతులు కట్టుకుని అక్కడినుండి వెళ్ళిపో.
రాత్రికెలాగూ నీ మరణం తప్పదు.
05-06-14
- నంద కిశోర్












Click it and Unblock the Notifications