కవిస్వరం: లక్ష్మణ్ స్వామి కవిత
నదీతీరంలో పాఠకుడు నిలబడితే ప్రకృతి దృశ్యం కట్టే కవిత లక్ష్మణ్ స్వామి రాసిన అభౌతిక గీతం. తన కవితను లక్ష్మణ్ స్వామి అభౌతిక గీతం అన్నాడు గానీ భౌతిక పరిస్థితిని గుండె తాకేలా చూశాడు. మొత్తం కవితను ఓ ప్రతీకగా మార్చేసి దృశ్యాన్ని కళ్లకు కట్టించే ప్రయత్నం కూడా చేశాడు.
ప్రకృతి సౌందర్యానికి, దాని ఆనుకుని ఉన్న విషాదానికి మధ్య వైరుధ్యానికి ఏకరూపత కల్పిస్తూ కవితను మొత్తాన్ని ప్రతీకగా చేశాడు. నీడలు, ఎన్నీలను కన్నీళ్లుగా మారుస్తూ వంటి ప్రతీకలు జీవితంలోని విషాదాన్ని తెలియజేస్తుంటే, పరవశిస్తూ గులకరాళ్లు, ఆ పెదాల జనపదాలు వింటూ గులాబీలు వంటిని ప్రకృతి సౌందర్యాన్ని జీవిత సౌందర్యంగా మార్చి చెబుతున్నాయి. మంచెపై కిన్నెరసాని వాయిద్యం నుంచి కవిత ప్రకృతిలోని సౌందర్యాన్ని దృశ్యీకరిస్తూ వస్తుంది.
ప్రకృతిలో సహజాతి సహజంగా కలిసిపోవాలనే కాంక్షను కవి వ్యక్తీకరిస్తున్నాడు. అలా వ్యక్తీకరించే సమయంలో మృగాల మానవారణ్యాలను విడివడాలనే కాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి జీవనామృత వాహినిలో లీనమవ్వాలనే కోరికను కాస్తా వాచ్యంగానే చెప్పాడు కవి. కానీ, జీవితం ప్రకృతిలాంటి సహజాతిసహజమైందిగా ఉండాలని కోరుకునే అభివ్యక్తిని ఆ వాక్యాన్ని కూడా కవితామయం చేసింది. మొత్తంగా, ప్రకృతికీ, మానవునికీ ఉండాల్సిన సహజ సబంధాన్ని కవిత తన కవితలో వ్యక్తీకరించాడు.
- కాసుల ప్రతాపరెడ్డి

అభౌతిక గీతం !
నదుల తీరంలో
ఏటవాలుగా నీడలు
నీడలతో ఆడుతూ అలలు
నీ పాదాలను స్పృశిస్తూ యేరు
పరవశిస్తూ గులకరాళ్ళు !
ఎన్నీల ను కన్నీళ్ళుగా మారుస్తూ
ఆమె ..?
ఆ పెదాల జాన పదాలను వింటూ
గులాబీలు !
మ౦చెపై కిన్నెరసాని వాయిద్యం
కంచె దాటివస్తున్న మలయ మారుతం
మంచుపూలచెట్టుకి పూసిన ముత్యాలు
మృగాల మానవారణ్యం నుండి విడి వడి
ప్రకృతి జీవనామృత వాహినిలో లీనమవ్వాలని నేను !!!
- లక్ష్మణ్ స్వామి
13 - 04 - 14
కవిసంగమం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications