అంతరిక్షంలో భారత్ నిఘా నేత్రం: వేకువ జామున చిక్కటి చీకటిని చీల్చుకుంటూ..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో మరో మైలురాయిని చేరుకుంది. తన ప్రయోగాల పరంపరలో ఓ నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఎర్త్ అబ్జర్వేషన్ లో అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన ఈఓఎస్-5 (EOS-5) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వేకువ జామున 2:55 నిమిషాలకు శాటిలైట్ ను మోసుకుంటూ 51.5 అడుగుల ఎత్తు ఉన్న జీఎస్ఎల్వీ ఎఫ్17 నింగిలోకి దూసుకెళ్లింది.
లాంచ్ ప్యాడ్ నుంచి బయలుదేరిన సరిగ్గా 19 నిమిషాల తర్వాత రాకెట్ నుంచి ఈ ఈఓఎస్ శాటిలైట్ విజయవంతంగా విడివడింది. దేశ సరిహద్దులను నిరంతరం పర్యవేక్షించడానికి, ఎప్పటికప్పుడు వాతావరణాన్ని అంచనా వేయడానికి ఈ ప్రయోగం ఎంతో కీలకం. ఈ ప్రయోగం ఇస్రోకు ఎంతో ప్రతిష్టాత్మకం కూడా. ఎందుకంటే.. 2021 ఆగస్టులో జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 ప్రయోగం విఫలం కావడంతో భారత్ తన జీశాట్-1 ఉపగ్రహాన్ని కోల్పోయింది.

ఆ పరాజయం నుంచి నేర్చుకున్న పాఠాలతో తాజా మిషన్ లో పలు సాంకేతిక సవరణలు చేసింది. ఈ ఇఓఎస్-5 కు తుది రూపాన్ని ఇచ్చింది. నాటి ఆ మిషన్కు ఇది ప్రత్యామ్నాయంగా దీన్ని ప్రయోగించింది. ఈ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాన్ని సబ్-జియోసింక్రోనస్ కక్ష్యలో ప్రవేశపెట్టింది. భూమికి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తున ఉంటుందీ జియో సింక్రోనస్ ఆర్బిట్. దీనికి ఇస్రో శాస్త్రవేత్తలు ఆకాశంలో నిఘా నేత్రం (Eye in the Sky) అని పిలుస్తున్నారు.
ఈ ఉపగ్రహం ప్రతి 30 నిమిషాలకోసారి భూమికి సంబంధించిన స్పష్టమైన చిత్రాలను పంపించగలదు. ప్రయోగం అనంతరం శ్రీహరికోటలోని మిషన్ కంట్రోల్ సెంటర్ ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. అధునాతన ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాన్ని తగిన కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టామని ప్రకటించారు. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి చోటు చేసుకున్న 107వ ప్రయోగం ఇది. అలాగే జీఎస్ఎల్వీ వాహక నౌక సిరీస్లో ఇది 19వది.
ఈ రాకెట్ సామర్థ్యాన్ని మెరుగుపరిచామని, ప్రారంభ దశలో ఈ స్పేస్ క్రాఫ్ట్ 1,536 కిలోల బరువును మాత్రమే మోసుకెళ్లేదని, ఇప్పుడు 2,367 కిలోల బరువున్న అత్యంత భారీ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి చేరవేసేలా దీన్ని తీర్చిదిద్దినట్లు వివరించారు. అంతరిక్షంలో కక్ష్యను క్రమంగా పెంచుతూ ఈ ఉపగ్రహాన్ని రాబోయే రోజుల్లో తుది జియో ప్లాట్ఫామ్లో అమర్చనున్నారు. ప్రస్తుతం దీని పనితిరు సజావుగా సాగుతోందని నారాయణన్ ధృవీకరించారు.
జియో సింక్రోనస్ ఆర్బిట్ నుంచి సేవలు అందించే ఇటువంటి ప్రత్యేక ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం భారత్కు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. ఈవోఎస్-5 శాటిలైట్.. ప్రధానంగా పర్యావరణ మార్పులు, సహజ విపత్తులను ఎప్పటికప్పుడు గమనించేలా రూపొందించారు. వరదలు, అకస్మాత్తుగా సంభవించే క్లౌడ్ బరస్ట్, తుఫానుల వంటి ప్రమాదకర వాతావరణ పరిస్థితులలో ఇది తక్షణ హెచ్చరికలను అందిస్తుంది.
Another giant leap for India in Space!
— Dr Jitendra Singh (@DrJitendraSingh) September 3, 2026
Kudos to Team @isro on the successful launch of GSLV-F17/EOS-05.
EOS-05 is a state-of-the-art Earth Observation satellite and India’s first imaging satellite from Geosynchronous Orbit, enabling advanced imaging across visible, infrared,… pic.twitter.com/1HHJrWM7ze
వ్యవసాయ ఉత్పత్తుల అంచనా, అడవుల విస్తీర్ణం పర్యవేక్షణ, కీలక జలాశయాలలో నీటి నిల్వల లభ్యత వంటి రంగాలపై సమగ్ర సాంకేతిక సమాచారాన్ని సేకరించి గ్రౌండ్ స్టేషన్ కు అందిస్తుంది. మూడు దశల ప్రొపల్షన్ వ్యవస్థతో నడిచే ఈ జీఎస్ఎల్వీ రాకెట్ సాంకేతిక రూపకల్పన ఎంతో ప్రత్యేక. ఇందులో ఉపయోగించిన అధునాతన క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ఇంజిన్.. కఠిన వాతావరణ పరిస్థితుల్లో కూడా స్థిరంగా పనిచేసే సామర్థ్యం కలిగి ఉంది.
🚨 𝗘𝗢𝗦-𝟬𝟱 𝗵𝗮𝘀 𝗯𝗲𝗲𝗻 𝘀𝘂𝗰𝗰𝗲𝘀𝘀𝗳𝘂𝗹𝗹𝘆 𝗽𝗹𝗮𝗰𝗲𝗱 𝗶𝗻𝘁𝗼 𝗶𝘁𝘀 𝗶𝗻𝘁𝗲𝗻𝗱𝗲𝗱 𝗦𝘂𝗯-𝗚𝗧𝗢 𝗼𝗿𝗯𝗶𝘁! 🎯
— ISRO Spaceflight (@ISROSpaceflight) September 3, 2026
GSLV-F17 mission is ACCOMPLISHED ✅️
Congratulations to the EOS-05 and GSLV teams at ISRO! 👏#GSLVF17 | #ISRO pic.twitter.com/R6Tiw3dJWK
ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష ప్రయాణంలో దీన్నొక అద్భుత మైలురాయిగా అభివర్ణించారు. విజిబుల్, ఇన్ఫ్రారెడ్, మల్టీ స్పెక్ట్రల్ హైపర్ స్పెక్ట్రల్ బ్యాండ్ల సాయంతో అత్యంత స్పష్టమైన ఇమేజింగ్ సేవలను అందించే ఈ ప్రత్యేక ఉపగ్రహం భారత్ను ప్రపంచ దేశాల సరసన అగ్రస్థానంలో నిలబెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.














Click it and Unblock the Notifications