రోహిత్, శుభ్మన్ గిల్ ను దాటేసిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్: ఆ రికార్డులు అవుట్
కొలంబో సింహళీస్ క్రికెట్ క్లబ్ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నూతన రికార్డు నెలకొల్పాడు. గాయంతో బాధపడుతూనే లంక బౌలర్లను చీల్చి చెండాడాడీ లెఫ్ట్ హ్యాండర్. జురెల్ తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా అగ్రస్థానానికి చేరుకున్నాడు.
లంకతో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్లో పంత్ దూకుడుగా ఆడాడు. 89 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఇందులో ఆరు బుల్లెట్ల వంటి ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు ఉన్నాయి. మొదటిరోజు లాహిరు బౌలింగ్ లో చేతికి దెబ్బ తగలడం వల్ల రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన పంత్.. రెండో రోజు తడాఖా చూపాడు. రెండో రోజు సారాంశ్ జైన్ ఆరు పరుగుల వద్ద అవుటైన వెంటనే పంత్ క్రీజ్ లో అడుగు పెట్టాడు. నొప్పి భరిస్తూనే జట్టును ఆదుకున్నాడు. క్రీజ్ లో చాలా సెటిల్డ్ గా ఆడాడు.

జురెల్ తో కలిసి ఏడో వికెట్కు రికార్డు స్థాయిలో 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు పంత్. ఇప్పటివరకు డబ్ల్యూటీసీలో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఘనతతో భారత్ తరఫున డబ్ల్యూటీసీ టోర్నీల్లో పంత్ అత్యంత ప్రభావవంతమైన ఆటగాడిగా నిలిచాడు. డబ్ల్యూటీసీ టోర్నమెంట్లో ఇప్పటివరకు రిషభ్ పంత్ మొత్తం 42 టెస్టు మ్యాచ్లు ఆడి 42.11 సగటుతో 2,948 పరుగులు చేశాడు.
ఇదే టోర్నీలో ఇప్పటివరకు 42 మ్యాచ్లు ఆడిన శుభ్మన్ గిల్ 42.27 సగటుతో 2,917 పరుగులతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఆ తరువాతి స్థానాల్లో రోహిత్ శర్మ- 2,716, రవీంద్ర జడేజా- 2,675, విరాట్ కోహ్లీ- 2,617 పరుగులు ఉన్నారు. ప్రస్తుతం జట్టులో ఉన్న యువ సంచలనం యశస్వి జైస్వాల్ కూడా ఇందులో చోటు దక్కించుకున్నాడు. 30 మ్యాచ్లలోనే 2,588 పరుగులు సాధించాడు.
పంత్ తెగువతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 400 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ గ్రౌండ్ లో మొదటి ఇన్నింగ్స్లో ఒక జట్టు 400 ప్లస్ పరుగులు సాధించడం ఇది 11వ సారి. ఇక్కడ ముందుగా 400 పరుగులు సాధించిన జట్లు ఆరు విజయాలు సాధించగా, నాలుగు టెస్టులు డ్రాగా ముగిశాయి.














Click it and Unblock the Notifications