భారత్ సెమీ ఫైనల్స్ కోసం ఏపీలో ఈ నగరాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు: ఫ్రీ ఎంట్రీ
విశాఖపట్నం: ఐసీసీ ప్రపంచ కప్ 2023 లీగ్ దశలో భారత్.. తన చిట్ట చివరి మ్యాచ్ ఆడుతోంది. నెదర్లాండ్స్ను ఎదుర్కొంటోంది. ఈ వరల్డ్ కప్లో ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్. దీని తరువాత సెమీ ఫైనల్స్ మొదలవుతాయి. 15, 16 తేదీల్లో రెండు సెమీ ఫైనల్స్ ముగుస్తాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు.. సెమీ ఫైనల్స్కు చేరుకున్నాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. భారత్- న్యూజిలాండ్తో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు.. నాలుగో పొజీషన్లో ఉన్న టీమ్తో ఆడటం ఆనవాయితీగా వస్తోంది. రెండో స్థానంలో ఉన్న జట్టు.. తన తరువాతి ప్లేస్లో ఉన్న టీమ్తో సెమీ ఫైనల్స్ ఆడాల్సి ఉంటుంది.

ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్.. వైదొలిగాయి. లీగ్ దశలోనే ఈ ఆరు జట్ల ప్రస్థానం ముగిసింది. సెమీ ఫైనల్స్కు చేరుకోవడానికి అవసరమైనన్ని పాయింట్లు, నెట్ రన్రేట్ను సాధించలేకపోయాయి.. ఈ ఆరు జట్లు కూడా.
తొలి సెమీస్లో భారత్తో తలపడే జట్టు న్యూజిలాండే. ఈ నెల 15వ తేదీన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ పోరు ఆరంభమౌతుంది. గెలిచిన జట్టు 19వ తేదీన ఫైనల్స్ ఆడుతుంది. 16వ తేదీన దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్స్ విజేతతో తలపడుతుంది.
ఈ మ్యాచ్ను తిలకించడానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఏపీలో మూడు నగరాల్లో ఈ మ్యాచ్ కోసం భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, విజయవాడ, కడప నగరాల్లో ఈ భారీ స్క్రీన్లు ఏర్పాటు కానున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రసారం ఆరంభమౌతుంది. మ్యాచ్ ముగిసేంత వరకూ కొనసాగుతుంది.
విశాఖపట్నంలో ఆర్ కే బీచ్లో ఈ బిగ్ స్క్రీన్ ఏర్పాటు కానుంది. కాళీ మాత అమ్మవారి ఆలయం ఎదురుగా దీన్ని అమర్చనుంది. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, కడపలో ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో ఈ స్క్రీన్లను అందుబాటులోకి తీసుకుని రానుంది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్. 10 వేల మంది ఒకేసారి మ్యాచ్ను తిలకించేలా ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.












Click it and Unblock the Notifications