జనవరిలో చంద్రబాబు మెగాషో
ఈ మధ్యనే ప్రపంచాన్ని చుట్టివచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తాజాగా ప్రపంచాన్ని తమ ప్రాంగణంలోకి రప్పించుకునే సన్నాహాల్లో పడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సిఐఐ తో కలసి వచ్చే జనవరిలో భారీ ఎత్తున పార్ట్నర్ షిప్ సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ మెగా సమ్మిట్ 2001లో విదేశాలకు చెందిన అగ్రశ్రేణి కంపెనీల సిఇవోలు సుమారు 200 మంది, దేశీయ బడా కంపెనీలకు చెందిన పారిశ్రామిక సామ్రాట్టులు మరో 600 మంది పాల్గొంటున్నట్టుగా తెలిసింది.
ఐటిలో ఆంధ్రప్రదేశ్తో పోటాపోటీగా వుంటూ పలు సందర్భంగా ముందుస్థానాన్ని దక్కించుకుంటున్న పొరుగురాష్ట్రం కర్ణాటక ఇటీవలనే అంగరంగ వైభవంగా నిర్వహించిన అంతర్జాతీయ ఐటి సదస్సుతో మనస్సు చెదరిన చంద్రబాబు, జనవరి సదస్సును నభూతో నభవిష్యతిగా జరపాలని కృతనిశ్చయంతో వున్నట్టుగా చెబుతున్నారు. ఐటి సదస్సువల్ల బెంగుళూరునేత కృష్ణ అంతర్జాతీయంగా వార్తల్లోకి రావడంతో పాటు తన రాష్ట్రాన్ని మరోసారి ప్రపంచదేశాల ఫోకస్లోకి తీసుకువెళ్లగలిగారు. అంతర్జాతీయ ప్రచారం విషయంలో జాతీయ నేతలనే సవాలు చేయగల చంద్రబాబు కర్ణాటకకు లభించిన ప్రచారంతో కినుకగా వున్నారని అందువల్ల జనవరి సదస్సుతో ప్రపంచదేశాల మధ్య ఆంధ్రప్రదేశ్ పేరు మారు మోగేలా చేయాలని భావిస్తున్నారని అంటున్నారు.
మంత్రులు, అత్యన్నత స్థాయి అధికారులతో ఈ మెగా ఈవెంట్కు సంబంధించి చంద్రబాబు ఈ మధ్య కాలంలో తరుచు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ భారీ షో ఎలాంటి చికాకులు లేకుండా సవ్యంగా అంతర్జాతీయ స్థాయిలో తనకు లభించిన ప్రచారానికి ధీటుగా వైభవంగా సాగాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. ఈ సమ్మిట్ నిర్వహణలో ప్రభుత్వ భాగస్వామిగా వున్న సిఐఐ, అతిధులకోసం ఇప్పటినుంచే నగరంలోని ప్రతిష్టాత్మకమైన ఫైవ్ స్టార్ హోటళ్లలో వసతి బుక్చేసిందని తెలిసింది. గ్రాండ్ కాకతీయ, తాజ్ రెసిడెన్సీ వంటి హోటళ్లలో అతిధులు బసచేస్తారు.
కాగా ఈ సందర్భంగా హైదరాబాద్ హెరిటేజ్ బిల్డింగ్స్కు తలమానికం వంటి పలక్నుమా ప్యాలెస్లో దేశంలోని అగ్రశ్రేణీ మోడల్స్తో బ్రహ్మాండమైన షోను సిఐఐ ఏర్పాటు చేస్తున్నది. వ్యాపార ప్రపంచానికి సంబంధించి పెద్దలు మాత్రమే కాకుండా కొన్ని దేశాల అధినేతలు కూడా స్వయంగా ఈ సదస్సులో పాల్గొనే అవకాశం వున్నదని అంటున్నారు. రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ ప్రారంభోత్సవం చేయనున్న ఈ సదస్సులో పెద్ద ఎత్తున ఎంఒయులపై సంతకాలు జరగాలని, రాష్ట్రానికి కుప్పతెప్పలుగా పెట్టుబడులు రావాలని ప్రభుత్వం ఆశిస్తున్నది. రాష్ట్రంలో అవకాశాలను విస్పష్టంగా ఈ సదస్సు సందర్భంగా ప్రదర్శించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
గత సంచికలో