"నేను ఇంట్లో లేనప్పుడు.. నా భర్తను చంపెయ్"
నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 10వ తేదీన జరిగిన హోటల్ నిర్వాహకుడి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు. కట్టుకున్న భార్యనే ప్లాన్ చేసి ప్రియుడితో హత్య చేయించినట్లుగా దర్యాప్తులో తేల్చారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లాలోని రామ్ నగర్ కాలనీలో కరీమ్ అనే వ్యక్తి తన భార్య సలీమాతో కలిసి ఓ హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొన్నాళ్ల క్రితం తమ్ముడు వరుసయ్యే గౌస్ పాషాను హోటల్ లో పనికి పెట్టుకున్నాడు కరీమ్. ఈ క్రమంలోనే కరీమ్ భార్య సలీమా అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంపై కరీమ్- సలీమా మధ్య గతంలో గొడవలు జరిగాయి. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. కానీ సలీమా మాత్రం పద్దతి మార్చుకోలేదు. ఈ క్రమంలోనే అడ్డుగా ఉన్న భర్త కరీమ్ ను చంపేందుకు సలీమా ప్లాన్ వేసింది. తాను ఇంట్లో లేనప్పుడు భర్తని చంపాలని ప్రియుడితో పథకం రచించింది.

అలా ప్లాన్ ప్రకారం ఈ నెల 9న నెల్లూరు దర్గాకు కరీమ్ భార్య సలీమా వెళ్లింది. ఆమె ఇచ్చిన సమాచారంతో ఇంట్లోకి చొరబడ్డ గౌస్ ఒంటరిగా ఉన్న కరీమ్ ను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు వెళ్లిపోయాడు. అయితే ఈ హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సలీమాపై అనుమానంతో ఆమెను తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలను నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు కేసును త్వరితగతిన ఛేదించిన సంబంధిత పోలీసులను ఆయన అభినందించారు.












Click it and Unblock the Notifications
