కాంగ్రెస్ క్షీణించిందా?

ఎన్టీవీ నీల్సన్ సర్వే ప్రకారం మహా కూటమికి 90-112 స్ధానాలు రావచ్చు. ప్రజారాజ్యానికి 32 నుంచి 38 వస్తాయి. మరో 7 నుంచి 10 స్ధానాల్లో ఇండిపెండెంట్లు, రెబల్స్ గెలుస్తారు. సాక్షి ప్రముఖంగా ప్రచురించిన ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ గతంలో కంటే బాగా క్షీణించినట్టే. చిరంజీవి పార్టీ ఎవరికి మద్దతు ఇస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు. కాంగ్రెస్ కు పెద్ద గ్యారంటీ ఏమీలేదని అర్ధమవుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ ఈ ఎన్నికలను మొండితనంతో ఎదుర్కొంటున్నారు. తాను అమలు చేసిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న అతి విశ్వాసం ఆయనలో ఒక వారం ముందు వరకు కన్పించింది, ఇప్పుడు ఎన్నికలు గంటల్లో పడేసరికి ఓటరు మహాశయులు తమ భావాలను చెప్పకనే చెబుతున్నారు. వైఎస్ ప్రతి జిల్లాలోనూ ప్రచార బాధ్యతలను ఆ జిల్లాలోని ప్రముఖ కాంగ్రెస్ నాయకుడికి అప్పగించి, తాను కార్పొరేట్ తరహాలో మానిటర్ చేసుకుంటూ ఉంటే బాగుండేది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు తాను ఒక్కడినే నాయకుడినన్నట్టు ఆయన వ్యవహరించడం వల్ల ఇప్పటికే పార్టీకి నష్టం జరిగింది. ఆయన పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ ను కూడా విశ్వాసంలోకి తీసుకున్నట్టు కన్పించడం లేదు.
ఆబ్జెక్టివ్ గా చూస్తే మహా కూటమిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనిపిస్తోంది. టీఅర్ ఎస్, వామపక్షాల బలం తగ్గినా తెలుగుదేశంతో కలిసి వారు మంచి ఫలితాలే సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగదు బదిలీ, ఉచిత కలర్ టీవీ, ఉచిత బియ్యం వంటి పథకాలు జనానికి ఆకర్షణీయంగా కన్పించడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఓటరు మహాశయుల మనసుల్లో ఇప్పటికే ఏదో ఒకటి తేలిపోయి ఉంటుంది. కొన్ని రోజుల్లో కేంద్రంలో ఎవరో రాష్ట్రంలో ఎవరో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications