జగన్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోతే....
రోశయ్యను తప్పించి మరో బలమైన నాయకుడిని హైకమాండ్ ముఖ్యమంత్రిని చేస్తే, తనకు జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశముండదని జగన్ ఆందోళన చెందుతున్నారు. హైకమాండ్ ఇస్తానన్న కేంద్ర సహాయ మంత్రి పదవిని తీసుకోకుండా కొంత కాలం గడపడం జగన్ శిబిరం వ్యూహంలా కన్పిస్తోంది. కానీ కాలం గడిచే కొద్దీ వైఎస్ మనుషులు తటస్ధంగా మారిపోతున్నారు. వట్టి వసంత కుమార్ వంటి వారు మినహా బొత్స, కన్నా వంటి వారు ఇప్పటికే స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు.
ముఖ్యమంత్రి పదవి లేకుండా, గాలి జనార్ధనరెడ్డి డబ్బు లేకుండా తన వ్యాపార సామ్రాజ్యాన్ని నడపడం కష్టమన్న విషయాన్ని జగన్ గ్రహించారు. మరీ ముఖ్యంగా సాక్షి మీడియా గ్రూపు తీవ్ర నష్టాల్లో ఉంది. కేంద్ర సహాయ మంత్రి పదవి వచ్చినా ఈ వ్యాపార సామ్రాజ్యాల కోసం నిధులు సమకూర్చుకోవడం కష్టమవుతుందన్న విషయం జగన్ శిబిరానికి తెలుసు. మరో వైపు శ్రేయోభిలాషి కెవిపి రామచంద్రరావు కూడా దాదాపు తటస్ధంగా మారిపోయిన రోశయ్యకు, హై కమాండ్ కు అనుకూలంగా మారారు.
గ్రేటర్ ఎన్నికల్లో వైఎస్ వ్యూహాన్నే జగన్ అనుసరించారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే బంగారు మైసమ్మను దర్శించుకుని మహేశ్వరం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించడానికి బయలుదేరారు. చెల్లెమ్మ, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజక వర్గం నుంచి ప్రతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడాన్ని స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి సంప్రదాయంగా చేసుకున్నారు. అలాగే జగన్ కూడా తన ప్రచారాన్ని సబితా ఇంద్రారెడ్డి నియోజక వర్గంలోని మహేశ్వరం నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించారు.