చిరంజీవిపై కాంగ్రెసు డైలమా?

చిరంజీవి వైఖరి వల్ల ఏం చేయాలో కార్యకర్తలు, నాయకులు నిర్ణయించుకోలేక పోతున్నారని అంటున్నారు. ప్రతి ప్రజా సమస్యపై వెంటనే ప్రతిస్పందించే చిరంజీవి, ప్రతి విషయంపై ముఖ్యమంత్రి వద్ద పరుగులు తీసే ఆయన ఇటీవల ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి ప్రతినిధులను కూడా పంపించలేదు. దీనిపై పార్టీలోని కొంత మంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. రైతు సమస్యలపై పార్టీ చిత్తశుద్ధి లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
కాగా, చిరంజీవితో స్నేహం విషయంలో కాంగ్రెసు అధిష్టానవర్గమే డైలమాలో పడినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం తిరుగుబాటు చేస్తే చిరంజీవిని అడ్డు పెట్టి రోశయ్య ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే అధిష్టానం ఆలోచనలో మార్పు వచ్చినట్లు చెబుతున్నారు. నిజానికి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోయిన వెంటనే చిరంజీవిని చేరదీయాలనేది అధిష్టానం వ్యాహం. అయితే, జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్నప్పటికీ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేసే పద్ధతిలో వ్యవహరించడం లేదు. దాంతో జగన్ పై చర్య తీసుకోవడాన్ని అధిష్టానం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవిని దగ్గర చేసుకునే ప్రయత్నాలను ఆపివేసినట్లు చెబుతున్నారు.
పైగా, చిరంజీవికి ప్రచారం జరుగుతున్నంత బలం లేదని కాంగ్రెసు ఓ అంచనాకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి సభలకు ప్రజలు పెద్ద యెత్తున వస్తున్నప్పటికీ దాన్ని ఓట్లుగా మార్చుకునే వ్యవస్థాగత నిర్మాణం చిరంజీవికి లేదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చిరంజీవిని చేరదీస్తే జగన్ వర్గం మూకుమ్మడిగా వ్యతిరేకించే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం తమకు, ముఖ్యమంత్రి రోశయ్యకు మద్దతుగా నిలుస్తున్న దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వర్గం మంత్రులు, శాసనసభ్యులు కూడా చిరంజీవిని దూరంగా పెట్టాలనే సూచిస్తున్నట్లు సమాచారం. తాము ప్రభుత్వానికి అండగా ఉంటామని, జగన్ ఏదో ఒక రోజు తప్పు గ్రహించి తిరిగి దారిలోకి వస్తారని వారు వాదిస్తున్నట్లు సమాచారం. అంతేకాకండా, మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టి తమను తొలగిస్తే తిరుగుబాటు తప్పదని రఘువీరా రెడ్డి వంటి కొంత మంది మంత్రులు రోశయ్యను హెచ్చరించినట్లుగా కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ స్థితిలో చిరంజీవిని దూరంగా ఉంచడమే మంచిదనే నిర్ణయానికి కాంగ్రెసు అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, చిరంజీవికి ఏ విషయం చెప్పకుండా నానుస్తూ పోవాలనే ఎత్తుగడను అనుసరిస్తున్నట్లు సమాచారం. దీంతో చిరంజీవిలో అసహనం పెరుగుతోందని అంటున్నారు. తీవ్ర నిర్ణయం తీసుకోదలిస్తే ఆ విషయాన్ని చిరంజీవికే వదిలేయాలని కూడా కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications