ఎన్టీఆర్ కు లక్కీ, బాబుకు షాక్

26 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని ప్రారంభించిన తర్వాత 1984లో గుంటూరులో సభను నిర్వహించారు. ఆ సభ భారీ సక్సెస్ అయింది. అంతేకాదు ఆ తర్వాత ఎన్నికల్లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించింది. కాంగ్రెస్ మట్టి కొట్టుకు పోయింది. ఎన్టీఆర్ ఆ సభను ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట నిర్వహించారు. అనంతరం 1994లో రెండోసారి అక్కడే సభను నిర్వహించారు. దానికి రైతు సదస్సు అని నామకరణం చేశారు. ఆ సభ అనంతరం వచ్చిన ఎన్నికలలో కూడా ఎన్టీఆర్ ఘన విజయం సాధించారు. ఇలా గుంటూరులో ఎన్టీఆర్ తాను ఏర్పాటు చేసిన రెండు భారీ సభల కారణంగా కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి అధికారంలోకి వచ్చాడు.
గుంటూరు సభలు దివంగత ఎన్టీఆర్ కు విజయాన్ని సాధించి పెట్టగా, చంద్రబాబుకు అందుకు విరుద్ధంగా అపజయాలను మూటగట్టాయి. తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన అనంతరం చంద్రబాబు తిరుమలకు వెళుతుండగా నక్సలైట్లు ఆయన్ను లక్ష్యంగా చేసుకొని క్లైమోర్ మెన్లతో పేల్చారు. వేంకటేశ్వరస్వామి దయవల్ల ఆయన ప్రాణాపాయాన్ని తృటిలో తప్పించుకున్నారు. అదే అదనుగా దానిని క్యాష్ చేసుకుందామని శాసనసభను రద్దు చేసి కాస్త ముందుగానే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికలకు ముందు గుంటురులోనే భారీ బహిరంగ సభను నిర్వహించారు. అయితే ఆ సభ ఆయనకు విజయాన్ని తెచ్చివ్వక పోగా భారీ ఓటమిని మిగిల్చింది. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ పరాజయం మూటగట్టుకున్నది. ఆ తర్వాత 2009లో సాధారణ ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు గుంటూరులో యువగర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. అప్పుడూ ఓడిపోయారు. దీంతో ఎన్టీఆర్ కు కలిసి వచ్చిన గుంటూరు సభ, చంద్రబాబుకు కలిసి రావటం లేదని కొందరు తమ్ముళ్ల మదిని తొలుస్తోంది.
రాష్ట్ర రైతాంగ సమస్యలపై ఎనిమిది రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన చంద్రబాబునాయుడు, అందరం కలిసి దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధమవుదామని జాతీయ నేతలు, వివిధ పార్టీల నాయకులు ఒత్తిడి తీసుకు రావటంతో తన దీక్షను విరమించారు. చంద్రబాబు దీక్ష సమయంలోనే రైతుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, కలిసి వచ్చే పార్టీలతో కలిసి భారీ బహిరంగ సభను నిర్వహించుదామని యోచించారు. దీక్ష సమయంలోనే గుంటూరును దీక్ష వేదికగా ప్రకటించారు. 30వ తారీఖున సభను పెట్టుకున్నారు. అప్పటి వరకు బాబు దీక్ష విరమించకుంటే నేరుగా నిమ్స్ నుండి దీక్షకు తీసుకు వద్దామని అనుకున్నారు. అయితే ఆయన దీక్ష విరమించడంతో ఆయన రాక పూర్తిగా ఖరారు అయింది. మరి రైతుల కోసమంటూ నిరవధిక నిరాహార దీక్ష చేసిన చంద్రబాబుకు ఈసారైనా కలిసి వస్తుందా చూడాలి.












Click it and Unblock the Notifications