కమ్మకులంలో అసంతృప్తి
గుంటూరు జిల్లాలో రాయపాటి వర్గానికి, కాపు కులానికి చెందిన కన్నా లక్ష్మీ నారాయణ వర్గానికి ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేటంతటి రాజనీతి రోశయ్య వద్ద లేదు. వైఎస్ ఉన్నంత కాలం ఇద్దరూ ఎన్ని విభేదాలు ఉన్నా నోరు బయటపెట్టుకోలేదు. రాష్ట్రంలోని అతి పెద్ద జిల్లాలో ఒకటైన గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇలా రెండు ప్రధాన కులాల మధ్య చీలిపోయిన విషయం హైకమాండ్ దృష్టి వరకు వెళ్ళింది.
కృష్ణాజిల్లాలో కూడా మంత్రివర్గ విస్తరణ తర్వాత కులాల కురుక్షేత్రం జరిగే అవకాశముంది. ప్రస్తుతం ఆజిల్లాలో ఒకే ఒక మంత్రి పార్ధ సారధి ( యాదవ) ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో ఒక కమ్మను, ఒక కాపును తీసుకునే అవకాశముంది. గుంటూరు రాజకీయాలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి.
నిజానికి తెలుగుదేశంలో కంటే కాంగ్రెస్ లోనే సీనియర్ కమ్మ నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయినా కాంగ్రెస్ లో కమ్మ నాయకులకు తగిన ప్రాధాన్యం లేదన్న అభిప్రాయం ఆ వర్గంలో ఉంది. వైఎస్ గత పాతికేళ్ళుగా కోస్తా ఆంధ్రలో కమ్మవారికి వ్యతిరేకంగా కాపు నాయకత్వాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. అందులో భాగమే ఈ కన్నా లక్ష్మీనారాయణ, వట్టి వసంతకుమార్ వంటి వాళ్ళు. వైఎస్ కేబినెట్ ( రోశయ్య దానినే కొనసాగిస్తున్నారు)లో కాపుల సంఖ్య గణనీయంగా ఉంది.
ఆర్ధికంగా, ఇతరత్రా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న రోశయ్యకు ఈ కులాల కుంపట్లు కొత్త సమస్యగా పరిణమించాయి. ఆయన వైశ్య కులం ఆర్ధీకంగా ముందు ఉన్నా రాజకీయంగా వెనుకబడి ఉంది. ఓట్ల సంఖ్య కూడా చాలా తక్కువ. ఈ సమస్యలను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతున్న రోశయ్య ఒక్కోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ మొహంలో ఎప్పుడూ ఆగ్రహం కన్పించేది కాదు, ఆయన నవ్వుతూ సమస్యలను పరిష్కరించుకుంటూ పోయేవారు. రోశయ్యకు ఈ వయసులో పర్సనాలిటీ డెవలప్ మెంట్ పాఠీలు ఎవరు చెబుతారు? అంతా కాలానికి విడిచి పెట్టాల్సిందే.