కిరణ్ విఫలమైన చోట బొత్స

కిరణ్ కుమార్ రెడ్డి విఫలమైన చోట బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. అసంతృప్తితో ఉన్న శాసనసభ్యులను ఆయన సంప్రదిస్తూ వారితో మాట్లాడుతున్నారు. వారిని తిరిగి పార్టీ చట్రంలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన అసమ్మతి శాసనసభ్యుడు శిల్పా మోహన్ రెడ్డితో చర్చలు జరిపారు. ఆయనను తీసుకుని వచ్చి ముఖ్యమంత్రితో బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర ఆసంతృప్తితో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రికి దూరమవుతూ వచ్చారు. ఇప్పుడు ఆయనను చేరదీసే దిశలో బొత్స సత్యనారాయణ సాగారు. ఇంతకు ముందు కూడా బొత్స సత్యనారాయణ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులు నీరజా రెడ్డి, రవిలతో కూడా మాట్లాడారు. కాంగ్రెసులో ఉండడానికి అంగీకరిస్తున్న ఎమ్మెల్యేల విషయం సరేసరి, అటూ ఇటూ ఊగిసలాడుతున్న శాసనసభ్యులకు ఆయన నిక్కచ్చిగానే చెబుతున్నారు. అటో ఇటో తేల్చుకోవాలని వారికి స్పష్టం చేస్తున్నారు. ఉంటే కాంగ్రెసులో ఉండండి, లేదంటే జగన్ వైపు వెళ్లండి, రెండు పడవల మీద మాత్రం కాలు పెట్టవద్దని చెబుతున్నారు.
ముఖ్యమంత్రిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చిత్తూరు జిల్లా రామచంద్రా రెడ్డితో చిరంజీవి చర్చలు జరిపారు. బొత్స సత్యనారాయణ సూచన మేరకే తన తిరుపతి పర్యటనలో చిరంజీవి ఆయనతో చర్చలు జరిపినట్లు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని దించడానికే తాను పనిచేస్తానని ఆయన ప్రకటించారు. కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద, బొత్స సత్యనారాయణ పార్టీ శాసనసభ్యులను గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications