కాంగ్రెసుతో చిరంజీవికి మెగా ట్రబుల్

ప్రజారాజ్యం పార్టీ తరఫున 18 మంది శాసనసభ్యులు ఎన్నిక కాగా, శోభా నాగిరెడ్డి వైయస్సార్ కాంగ్రెసుతో వెళ్తున్నారు. మిగతా 17 మంది చిరంజీవితోనే ఉండే అవకాశాలున్నాయి. అయితే, కొత్తవారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇప్పించుకోవడం మాట అటుంచితే సిట్టింగ్ శాసనసభ్యులకు తిరిగి టికెట్లు ఇప్పించుకోవడం, ఆయా నియోజకవర్గాల్లో ప్రాధాన్యం కల్పించడం తీవ్రమైన సమస్యగా మారే అవకాశం ఉంది. స్థానిక కాంగ్రెసు నాయకత్వాల నుంచి వారికి తీవ్రమైన వ్యతిరేకత ఎదురు కావచ్చు. పైగా, కాంగ్రెసులో ఉన్నవారు హేమాహేమీలు వారి ధాటికి చిరంజీవి వర్గం తట్టుకోవడం అంత సులభం కాదు.
కర్నూలు జిల్లా బనగానపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రజారాజ్యం శాసనసభ్యుడు కాటసాని రాంరెడ్డికి, కాంగ్రెసు మాజీ శాసనసభ్యుడు చల్లా రామకృష్ణా రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కాటసాని రాంరెడ్డిని ఢీకొట్టేందుకు చల్లా రామకృష్ణా రెడ్డి సిద్ధపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో అనిల్కు శాసనసభ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. పైగా, సురేష్ రెడ్డి నాయకత్వం కింద అనిల్ పనిచేయాల్సి వస్తుంది. సురేష్ రెడ్డిని తట్టుకుని అనిల్ నిలబడడం కష్టమే. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లోనూ అదే స్థితి. నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెసు సీనియర్ నాయకుడు ఇంద్రకరణ్ రెడ్డిని ప్రజారాజ్యం శాసనసభ్యుడు మహేశ్వర రెడ్డి తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది.
కోస్తాలో మాత్రం కొణతాల రామకృష్ణ వంటి నాయకులు వైయస్సార్ కాంగ్రెసులోకి వెళ్లిపోవడం వల్ల ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే, మొదటి నుంచీ కాంగ్రెసులో ఉన్న ఇతర స్థానిక నాయకుల నుంచి వారికి సహకారం లభించడం కష్టమే కావచ్చు. ప్రజారాజ్యం, కాంగ్రెసు పార్టీల క్యాడర్ మధ్య సయోధ్య కుదర్చడం పెద్ద పనిగానే ఉంటుంది.












Click it and Unblock the Notifications