కెసిఆర్కు వైయస్ జగన్ దీమా
తమ అభ్యర్థికి బిజెపి, సిపిఐ కూడా ఓట్లు వేస్తాయని ఆయన నమ్ముతున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి దూరమైన పోచారం శ్రీనివాస రెడ్డి ఓటు కూడా తమకే వస్తుందని ఆయన నమ్ముతున్నారు. దీనివల్ల తెరాస అభ్యర్థికి 16 శాసనసభ్యుల మద్దతు లభిస్తుంది. అయినా ఎన్నిక కావడం కష్టమే. అయితే, వైయస్ జగన్ వర్గం శాసనసభ్యుల మద్దతు తమకు లభిస్తుందని కెసిఆర్ నమ్ముతున్నట్లు సమాచారం. ఇద్దరేసి తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీ సభ్యులతో కలిపి జగన్ వెంట 23 మంది శాసనసభ్యులున్నారు. వైయస్ జగన్ సహకరిస్తే తమ పార్టీ అభ్యర్థి విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని కెసిఆర్ అనుకుంటున్నారు.
కచ్చితంగా కాంగ్రెసు తన మిత్రపక్షాలతో కలిసి ఆరు సీట్లను, తెలుగుదేశం పార్టీ మూడు సీట్లను గెలుచుకోవడానికి వీలుంది. మరో సీటు కోసమే పోటీ జరుగుతుంది. అయితే, ఈ సీటుకు కాంగ్రెసు పార్టీ తన అభ్యర్థిని నిలుపుతుందా అనేది సందేహమే. జగన్ వర్గం కాంగ్రెసు శాసనసభ్యులు, తెలుగుదేశం, ప్రజారాజ్యం శాసనసభ్యులు తెరాస అభ్యర్థికి ఓటు వేస్తే రహస్య కోడ్ ద్వారా వారిని కనుక్కోవడానికి వీలవుతుంది. కానీ, వారిపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి వీలు కాదు. పార్టీ పరంగా మాత్రమే చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది. అయితే, జగన్ వర్గం స్వయంగా అభ్యర్థిని నిలపడానికి వీలు కాదు. అలా నిలిపితే ఆ అభ్యర్థిని బలపరిచే ఇతర పార్టీ సభ్యులపై అనర్హత వేటు పడుతుంది. అందువల్ల వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు తెరాస అభ్యర్థికి సహకరించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రతీకారం తీసుకోవచ్చునని అంటున్నారు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన కాంగ్రెసు పార్టీ మరో అభ్యర్థిని పోటీకి దించకపోవచ్చునని కూడా అంటున్నారు. అలా జరిగితే తెరాస అభ్యర్థి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అలా అయితే తెరాస జాక్ పాట్ కొట్టినట్లే.