కెసిఆర్ ట్రాప్లో కాంగ్రెసు నేతలు?
కెసిఆర్ ట్రాప్లో తమ పార్టీ తెలంగాణ నాయకులు పడబోరని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. తాము కెసిఆర్ ట్రాప్లో పడబోమని తెంలగాణకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు. అయితే, రాజీనామాలకు కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులను సిద్ధం చేయాలనే వ్యూహంతో కెసిఆర్ కదులుతున్నారు. రాజీనామాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తుంది తప్ప ఉప ఎన్నికలు రావని ఆయన నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే పోటీ లేకుండా గెలిచేందుకు ఏర్పాట్లు చేస్తామని కూడా ఆయన భరోసా ఇస్తున్నారు. తెలంగాణ జెఎసి కోదండరామ్ కూడా కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు అదే విషయం చెబుతున్నారు.
రాజీనామాలు చేస్తామని చెబుతూ వచ్చిన కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు క్రమంగా వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్థితిలో కూడా కెసిఆర్ తన పట్టు వీడడం లేదు. కాంగ్రెసు ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి, తాను రాజీనామా చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని మాత్రం ఆయన దూరం పెట్టి, మిగతా రాజకీయ పార్టీల తెలంగాణ ప్రజాప్రతినిధులను కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. అయితే, కెసిఆర్ వ్యూహం ఫలిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.