జగన్పై ఐటి దాడులకే, నామా..?
వైయస్ జగన్ను కట్టడి చేయడానికి కాంగ్రెసు అధిష్టానం ఎక్కువగా రాజకీయ వ్యూహాలనే అమలు చేస్తూ వస్తోంది. జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులను హెచ్చరించడం, బుజ్జగించడం వంటివాటిని ప్రయోగిస్తూ వచ్చింది. తాజాగా, చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీని తమ పార్టీలో విలీనం చేసుకోవడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. రాజకీయంగా జగన్ శక్తి సామర్థ్యాలను తగ్గించడంతో పాటు జగన్కు దీటైన నాయకుడిని రంగంలోకి దింపాలనేది కూడా సోనియా వ్యూహంగా కనిపిస్తోంది. ఇక, ఇప్పుడు జగన్ ఆర్థిక అంశాలపై సోనియా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.
జగన్ ఆస్తులపై దాడులు చేసేందుకే తొలుత నామా నాగేశ్వర రావు ఇంటిపై, సంస్థలపై ఐటి దాడులు జరిగినట్లు చెబుతున్నారు. ఇప్పటికే సాక్షి మీడియాలో పెట్టుబటడులు పెట్టినవారికి, వైయస్ జగన్కు ఐటి నోటీసులు జారీ అయ్యాయి. వాటికి వివరణ ఇవ్వాల్సిన అవసరం జగన్కు, ఇతర సంస్థల అధిపతులకు ఉంది. ఈ నేపథ్యంలోనే ఐటి అధికారులు మరోసారి జగన్ ఇళ్లపై, సంస్థలపై దాడులు చేయవచ్చుననే ఊహాగానాలు ఊపందుకున్నాయి. పార్టీ నుంచి బయటకు వచ్చినందు వల్లనే, కాంగ్రెసును వ్యతిరేకిస్తున్నందు వల్లనే తనపై కక్ష సాధింపు చర్యగా ఐటి దాడులు జరుగుతున్నాయని జగన్ గానీ ఆయన వర్గం గానీ విమర్శలు చేస్తే వాటి దాటిని తగ్గించేందుకే ముందుగా నామాను టార్గెట్ చేసుకున్నట్లు చెబుతున్నారు. తమకు పార్టీలతో సంబంధం లేదని ఐటి అధికారులు చెప్పడానికి వీలుగా నామా వ్యవహారాన్ని ముందస్తు వ్యవహారంగా భావిస్తున్నారు.