మొద్దు శీను హత్య నుంచి పటోళ్ల హత్య దాకా..
గుంటూరు జిల్లాలో డిగ్రీ చదివే సమయంలోనే మొద్దు శీను రాజకీయాల్లో చురుకైన పాత్ర వహిస్తూ వచ్చాడు. దాంతో నేరప్రపంచంలోకి ప్రవేశించాడు. అతను హైదరాబాదులో ఓ హత్య కేసులో నిందితుడు. ఈ కేసులో పరారీలో ఉన్నప్పుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి అనుచరుడిగా మారాడు. పటోళ్ల గోవర్ధన్ రెడ్డి ఓ విప్లవ సంస్థలో పనిచేసి మాఫియా ప్రపంచంలోకి ప్రవేశించాడు. వెంకటరెడ్డి అనే మాజీ మావోయిస్టును పటోళ్ల గోవర్ధన్ రెడ్డితో కలిసి మొద్దు శీను హత్య చేశాడు. ఆ తర్వాత మొద్దు శీనుకు జైలులో మద్దెలచెర్వు సూరితో పరిచయం ఏర్పడింది. సూరితో కలిసి పరిటాల రవి హత్యకు కుట్ర చేసి హతమార్చాడు. ఈ కేసులో పరారీలో ఉండగా, అనూహ్యంగా ఓ లాడ్జీలో బాంబు పేలుడులో గాయపడి ఆస్పత్రిలో చేరి పోలీసు చేతికి చిక్కాడు. అనంతపురం జైలులో అతన్ని 2008 నవంబర్ 9వ తేదీన తోటీ ఖైదీ ఓం ప్రకాశ్ హత్య చేశాడు.
కాగా, పరిటాల రవి హత్య కేసులో బెయిల్పై బయటకు వచ్చిన మద్దెలచెర్వు సూరి తన ముఖ్య అనుచరుడు భాను కిరణ్ చేతిలో హతమయ్యాడు. ఇరువురి మధ్య వాటాల పంపకాల్లో తగాదాలు వచ్చి ఈ ఏడాది జనవరి 2వ తేదీన హైదరాబాదులో సూరి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో భాను కిరణ్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. ఇప్పుడు వారితో స్నేహం చేసి, పరిటాల రవి హత్యలో తన పాత్ర కూడా ఉందని చెప్పుకుంటూ వచ్చిన పటోళ్ల గోవర్ధన్ రెడ్డి కూడా తన అనుచరుడి చేతిలోనే హతమైనట్లు అనుమానిస్తున్నారు.
ఇటీవలే జైలు నుంచి విడుదలైన పటోళ్ల గోవర్ధన్ రెడ్డి సెటిల్మెంట్ల వ్యవహారంలోనే హతమైనట్లు అనుమానిస్తున్నారు. బోడుప్పల్లోని ఈ భూవివాదమే అతని హత్యకు దారి తీసినట్లు చెబుతున్నారు. నయీమ్ గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని గోవర్ధన్ రెడ్డి భార్య వింద్యా రెడ్డి ఆరోపిస్తోంది. మొద్దు శీను, సూరి, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి నేరాల చిట్టాలో ఆరితేరినవారు, ముగ్గురూ పరిటాల రవి హత్య కేసులో నిందితులు. ముగ్గురూ హతమయ్యారు.