చంద్రబాబు హ్యాపీ!
అయితే ఎన్నికలకు గతంలో మాదిరిగానే అంతగా సిద్ధంగా లేక పోయినప్పటికీ ఇదివరకంటే ఇప్పుడు బెటర్ అన్న రీతిలో ఆయన కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సంక్షోభంలో కూరుకు పోయినప్పటికీ టిడిపికి అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశమున్నప్పటికీ ఆయన పెట్టక పోవడానికి కారణం ఇటు సీమాంధ్రలోగానీ, అటు తెలంగాణలోగానీ టిడిపి పరిస్థితి బాగా లేక పోవడం వల్లనే. ఇక పార్టీ మళ్లీ క్రమంగా పుంజుకుంటోందనే భావం ఆయనలో కనిపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు.
నిన్నమొన్నటి వరకు ఇటు తెలంగాణ ఉద్యమం కారణంగా ఎవరినీ ఏమనని పరిస్థితి ఆయనలో నెలకొంది. తెలంగాణలో నాగం జనార్ధన్ రెడ్డి చంద్రబాబుకు ధీటుగా రాజకీయాలు చేసినప్పటికీ ఆయన బహిరంగంగా ఏమీ అనలేని పరిస్థితి నెలకొనడంతో పాటు, నాగంపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనక్కి తగ్గారు. నాగంపై చర్యలు తీసుకుంటే తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర పడుతుందనే ఆయన నాగంను లోలోన హెచ్చరించారు. అందుకే నాగం హవాను తగ్గించడానికి చంద్రబాబు ఇతర తెలంగాణ నేతలను తెరపైకి తెచ్చి వారిని ప్రోత్సహించినట్టు కూడా వార్తలు వచ్చాయి.
తెలంగాణ వారికి మద్దతుగా మాట్లాడితే సీమాంధ్ర నేతల భయం ఆయనను వెన్నాడింది. అయితే అప్పుడప్పుడు మాత్రం ఆయన నేతలను మందలిస్తూ వచ్చారు. ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి రెండు ప్రాంతాలు ముఖ్యమని, అందుకే ఏం చెప్పలేక పోతున్నట్టుగా మాట్లాడారు. ఆ సమయంలో ఆయన మొహం పూర్తిగా వాడిపోయినట్లుగానే కనిపించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తెలంగాణ ఎమ్మెల్యేల ఉద్యమం మాదిరిగానే సీమాంధ్ర ఎమ్మెల్యేలు కూడా సభలో సమైక్యాంధ్ర ఎమ్మెల్యేల ఉద్యమంపై కూడా ఆయన వారిని హెచ్చరించినట్లుగా మాట్లాడినట్టుగా వార్తలు వచ్చాయి.
దీంతో ఎవరికి వారు ఉద్యమం చేయడం సరికాదనే భావనను సీమాంధ్ర ఎమ్మెల్యేలను హెచ్చరిండం ద్వారా తెలంగాణ ప్రజల్లో, కార్యకర్తల్లో కలిగించడం ఒకటి కాగా, చంద్రబాబు ఇన్నాళ్లు తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న నేతలను వ్యతిరేకిస్తున్నాడన్న అపవాదును సీమాంధ్రలను హెచ్చరించడం ద్వారా పోగొట్టినట్లుగా పలువురు భావిస్తున్నారు. దీంతో తెలంగాణలో తనపట్ల ఉన్న వ్యతిరేకతను కాస్తోకూస్తో తగ్గించుకోవడం, పార్టీని రెండు ప్రాంతాలలో రక్షించుకోవడం కోసం బాబు ఏమీ మాట్లాడలేక పోతున్నాడనే వాదనను కూడా టిడిపి బయటకు తీసుకు వస్తుంది.
ఈ వాదన వల్ల బయటినుండి విమర్శలు వస్తున్నప్పటికీ టిడిపి కార్యకర్తలకు మాత్రం సంతృప్తినిస్తున్నాయనే భావనలో బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు సీమాంధ్రలో ఇటీవల వరకు మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న హవాను ఆయన కొనసాగించలేక చతికిల పడ్డట్టు కూడా బాబు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలోని కార్యకర్తల్లో నమ్మకం కలిగించడం, సీమాంధ్రలో జగన్ ప్రభావం తగ్గడం వల్ల టిడిపి మళ్లీ పుంజుకుంటుందనే భావన వల్లే బాబులో సంతోషం కనిపిస్తుందని పలువురు అంటున్నారు.