అజ్మల్ కసబ్: దొంగ నుంచి టెర్రరిస్టుగా...
ఓసారి ఆయుధాల కొనుగోలు సమయంలో లష్కరే తోయిబాతో కసబ్కు పరిచయమైంది. ఆ సంస్థ వైపు ఆకర్షించబడ్డాడు. లష్కరే తోయిబా మార్గంలో వెళితే పాక్ సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని భావించిన కసబ్ అటు వైపు వెళ్లాడు. దాడుల కోసం వారి వద్ద అత్యుత్తమ శిక్షణ తీసుకున్నాడు. కసబ్ చలాకీతనాన్ని గుర్తించిన లష్కరే తోయిబా అతనికి మంచి శిక్షణను ఇచ్చింది. ఆ తర్వాత భారత్పై దాడికి పురికొల్పింది. దాడిలో ప్రాణాలు కోల్పోతే తన కుటుంబానికి భారీ ఆర్థిక సహాయం చేస్తామని లష్కరే తోయిబా చెప్పడం కూడా కసబ్కు నచ్చింది.
అయితే, ఓ డాక్యుమెంటరీ అందుకు భిన్నమైన కథనాన్ని అందించింది. డబ్పుల కోసం తన తండ్రి తనను లష్కరే తోయిబాకు విక్రయించాడని ముంబై దాడుల కేసు కసబ్ చెప్పుకున్నాడు. టెర్రర్ ఇన్ ముంబై అనే పేరుతో హెచ్ బీఓలో కొత్త డాక్యుమెంటరీలో కసబ్ మాటల క్యాసెట్ ను చేర్చారు. కసబ్ కు, పాకిస్తాన్ లోని అతని నియంత్రణదారులకు మధ్య జరిగిన సెల్ ఫోన్ సంభాషణలను కసబ్ తో పోలీసుల వీడియో ఫుటేజ్ ను ఈ డాక్యుమెంటరీలో చేర్చారు. ఆ మధ్య సిఎన్ఎన్ లో ప్రసారమైన ఈ డాక్యుమెంటరీకి ఫరీద్ జకారియా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
తాను లష్కరేతో ఎలా వెళ్లిందీ ఒక టేప్ లో కసబ్ వెల్లడించాడు. "మనకు డబ్బులు కావాలి, మనం ఇక ఎంత మాత్రం పేదలుగా ఉండకూడదు, నీ సోదరులకు, నీ సోదరీలకు పెళ్లిళ్లు జరగాలి, మంచి జీవితాన్ని అనుభవిస్తున్న వారిని చూడు, నువ్వు కూడా వారిలా ఉండగలవు" అని తనకు తన తండ్రి చెప్పినట్లు కసబ్ వివరించాడు. తనకు లష్కరే శిక్షణ ఇచ్చిన తీరును కూడా అతను వివరించాడు.
ముంబై దాడుల కేసులో 658 మంది వాంగ్మూలమిచ్చారు. 30 మంది సాక్ష్యులు కసబ్ను గుర్తించారు. పదేళ్ల బాలిక కసబ్ పైన ఫిర్యాదు చేసింది. ముంబయి దాడులకు బీజం పాక్ లోనే అని సుప్రీం కూడా గుర్తించింది. ప్రత్యేక కోర్టులో ఇద్దరు ఎన్ఎస్జి కమెండోలు సాక్ష్యమిచ్చారు. సాంకేతిక ఆధారాలను చూపించేందుకు అమెరికా ఎప్బిఐ సహకరించింది. కసబ్కు ఉరిశిక్ష పడితే ఆ శిక్ష అనుభవించినవారిలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారదేశంలో కసబ్ 52వ వాడు అయ్యాడు.