జగన్ భయం, బాబు అభయం: కెసిఆర్ రె'డీ'
ముందస్తు ఎన్నికలకు రాష్ట్రంలో అన్ని పార్టీలు సిద్ధమౌతున్నాయి. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చుననే భయం అందర్నీ వెంటాడుతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల తామంటే తాము కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని ప్రకటనలు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా యూపిఏపై అవిశ్వాసం పెడతామని ప్రకటించారు.
ప్రకటనలు చేసిన ఆయా పార్టీలు మద్దతు విపక్షాలు, అధికార పార్టీల్లోని ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఇటు రాష్ట్రంలో అటు దేశంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగిలింది. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చుననే అభిప్రాయం అందరిలోనూ ఉంది. యూపిఏ ప్రభుత్వానికి ఢోకా లేదని దాదాపు అందరూ భావిస్తున్నప్పటికీ.. ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేమని అంటున్నారు.
అవిశ్వాసం పెడితే మాత్రం ఖచ్చితంగా యూపిఏ ప్రభుత్వం పడిపోతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం పడిపోతుందని తెలిస్తే ఎస్పీ, డిఎంకె వంటి పార్టీలు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం గట్టెక్కే పరిస్థితి లేదంటున్నారు. టిడిపి లేదా వైయస్సార్ కాంగ్రెసు అవిశ్వాసం పెడితే కిరణ్ ప్రభుత్వం కూలడం ఖాయమంటున్నారు.
కాంగ్రెసుకు కేవలం 156 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, అందులో ఇప్పటికే ముగ్గురు జగన్ వైపు వెళ్తున్నట్లుగా ప్రకటించారని, మిగిలిన వారిలో ఎందరు అండగా ఉంటారో చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు. మజ్లిస్ పార్టీ మద్దతు ఉపసంహరించడం కిరణ్ ప్రభుత్వానికి పెద్ద చిక్కులు తెచ్చిందనే చెప్పవచ్చు. అవిశ్వాసం పెట్టిన పక్షంలో మెజార్టీకి కావాల్సిన 148 మంది ఎమ్మెల్యేల మద్దతు కిరణ్కు ఉండక పోవచ్చునని లెక్కలు వేస్తున్నారు.
దీంతో చంద్రబాబు, జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావులు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ దారిలో నడుస్తున్నారు. ములాయం ఇప్పటికే 55 మంది లోకసభ అభ్యర్థులను ప్రకటించారు. ముందస్తుకు సిద్ధమయ్యే ములాయం అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు అదే దారిలో చంద్రబాబు నడవనున్నారు. సాధ్యమైనంత త్వరలో రాబోయే ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటిస్తానని అధినేత చెప్పారు.
ముందస్తు కోసం అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వారు చేస్తున్న ప్రకటనల్లో, పార్టీ సమావేశాల్లో వారు ముందస్తు సూచనలు చేస్తున్నారు. లోకసభకు ముందుగా ఎన్నికలు జరగాలనే భావనతో టిడిపి ఉందని అంటున్నారు. లోకసభకు ముందుగా ఎన్నికలు జరిగితే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకొని రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు ఉపయోగపడుతుందని బాబు భావిస్తున్నారట. ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ మరింత పటిష్టంగా తయారవుతుంది కాబట్టి అధికారంలోకి టిడిపియే వస్తుందనే భావనతో ఉన్నరట. టిడిపి ఖచ్చితంగా గెలుస్తుందని బాబు నేతలకు అభయం ఇస్తున్నారట.
రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు ఎక్కువ అసెంబ్లీ స్థానాలను యువకులకు ఇవ్వాలని ఇప్పటికే స్కెచ్ వేశారు. సీనియర్లను లోకసభకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. సెంటిమెంట్ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు కూడా బలంగానే ఉంది. అయితే పార్టీ అధ్యక్షుడు జగన్ బయట లేకపోవడమే ఆ పార్టీ క్యాడర్ను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ జైల్లో ఉండగానే వారు ముందస్తుకు సిద్ధమవుతున్నారు.
జగన్ జైలులోనే ఉండిపోతే విజయమ్మ, షర్మిలలు పార్టీని గట్టెక్కిస్తారా అనే ఆందోళన వారిని వెంటాడుతోందట. ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో జగన్కు బెయిల్ దొరికి బయటకు వస్తే బాగుండుననే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తోంది. ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా వస్తే తమకే మంచిదని, అయితే జగన్ ఉంటేనే లాభం ఉంటుందని, కాబట్టి జగన్ బయటకు వచ్చే వచ్చే సంవత్సరం వరకు ఎన్నికలు రాకుండా ఉండటమే ఉత్తమమనే భావనతో ఆ పార్టీ ఉందంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ముందస్తు ఎన్నికలకు ఉవ్వీళ్లూరుతున్నారు. ముందస్తు ప్రచారం జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుపొందేందుకు కెసిఆర్ ఉద్యమాన్ని ఉధృతం చేసే ప్లాన్లో ఉన్నారు. వచ్చే మార్చి వరకు ఎన్నికలు వస్తే తాము ఎక్కువ సీట్లు గెలుచుకొని కేంద్రంలో చక్రం తిప్పే అవకాశముంటుందని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. ఇన్నాళ్లూ టిడిపిని టార్గెట్ చేసుకున్న కెసిఆర్ తాజాగా జగన్ పార్టీని లక్ష్యంగా పెట్టుకున్నారు.
బిజెపి కూడా ఎన్నికలకు సిద్ధంగానే ఉంది. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతుండగా.. అధికార కాంగ్రెసు పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. 2014 వరకు కేంద్రంలో, రాష్ట్రంలో తమ ప్రభుత్వాలు కొనసాగుకాయని, ఇబ్బంది లేదని, అవిశ్వాసాలను ఎదుర్కొంటామని చెబుతున్నారు. అయితే వారిలో ఎన్నికల భయం మాత్రం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. కానీ రాష్ట్రంలో కుమ్ములాటల కారణంగా ఎవరు కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అంతేకాదు పార్టీ గురించి వదిలేసి మొదట తాము గెలుస్తామా అనే ఆందోళనలో ఉన్నట్లుగా ఉందంటున్నారు.