వైయస్ జగన్కు ధీటుగా ఆజాద్ వ్యూహం
ఈ సమావేశంలో జగన్ అవినీతిపై ఎటాక్ విషయం చర్చకు వచ్చింది. ఆర్థికమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంగా తామెవ్వరం ఈ విషయంలో గట్టిగా వ్యవహరించలేకపోయామని.. పైపెచ్చు గతంలో రాష్ట్ర మంత్రులమంతా కూడా ఇక్కడ అమలుచేస్తున్న పథకాలను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలుగానే చెప్పుకొంటూ వెళ్లడం కూడా కొంత నష్టం చేసిందని ఆయన అన్నారని తెలుస్తోంది.
వైయస్ మరణించిన తర్వాత దాదాపు ఏడాదిన్నర వరకు తాము ఆయన కొడుకు అవినీతిని పెద్దగా లేవనెత్తలేకపోయామని అంగీకరించారని తెలుస్తోంది. అయితే, జనంలో వైయస్పై ఉన్న సానుకూల సెంటిమెంటే ఇందుకు కారణమని ఆయన చెప్పినప్పుడు.. ఆజాద్ అడ్డు తగిలారని తెలుస్తోంది. సెంటిమెంటు ఎందుకుంటుందని, మీరు పూర్తిస్థాయిలో అటాక్ చేయాలని సూచించారు. అలాకాకుండా నెమ్మదిగా ఉండటం వల్లే సెంటిమెంట్ అని భయపడుతున్నారని కర్తవ్య బోధ చేశారు.
ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, పార్టీ బలోపేతం కావడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని, సార్వత్రిక ఎన్నికల నాటికి ఏం చేయాలో ఒక దీర్ఘకాలిక ప్రణాళిక రచించాలని సూచించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేస్తే పార్టీ బలోపేతం అవుతుందని వారికి సూచించారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో చూస్తే అసలు జగన్ పార్టీకి కేడర్ లేదని ఆయన వారికి సూచించారు.
మీరంతా సెంటిమంట్ అని వదిలేయడం వల్లే జగన్ ఎదుగుతున్నాడని, దీన్ని అర్థం చేసుకుని వెళ్తే జగన్ పార్టీని అధిగమించడం కష్టమేమీ కాదని సూచించారని తెలుస్తోంది. మనోధైర్యంతో ముందుకెళ్లాలని వారికి సూచించారు. ఈ సమయంలో మళ్లీ రామనారాయణ రెడ్డి కలగజేసుకుని, తామంతా జగన్ విషయంలో అటాక్ చేయడం మొదలుపెట్టిన తర్వాత పరిస్థితి మెరుగుపడిందని చెప్పగా, అప్పుడు జరగనిది ఇప్పుడెలా జరిగందని ఆజాద్ ప్రశ్నించారని తెలుస్తోంది. మొహమాటం లేకుండా నేతలంతా దూసుకెళ్తే జగన్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని సూచించారని సమాచారం.