టిడిపి టిక్కెట్ కోసం గబ్బర్ సింగ్ నిర్మాత గణేష్
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ను సిఐడి పోలీసులు అరెస్టు చేసిన తర్వాత, విచారణలో అతను ఎన్నో విషయాలు బయట పెట్టినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భానుతో బండ్ల గణేష్కు కూడా సంబంధాలు ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ చిన్న జూనియర్ ఆర్టిస్ట్ అని, అలాంటి వ్యక్తి కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు ఎలా తీస్తున్నారని, ఆయన వెనుక బొత్స ఉన్నారని టిడిపి ఆరోపణలు చేస్తుంది.
గణేష్ వెనుక బొత్స ఉన్నాడని చెప్పేందుకు తెలుగుదేశం పార్టీ పలు క్లిప్పింగ్స్ విడుదల చేసింది. బొత్సను గణేష్ పొగిడిన క్లిప్లింగ్స్ను మీడియాకు విడుదల చేసింది. బొత్సకు గణేష్ బినామీ అని ఆరోపించింది. టిడిపి ఆరోపణలపై బొత్స స్పందిస్తూ.. గణేష్ సినిమాలు నిర్మించకూడదా అని ప్రశ్నించారు. అయితే టిడిపి బద్ద శత్రువు అయిన కాంగ్రెసు ముఖ్య నేత బొత్సతో బండ్ల గణేష్కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో, తన పైనే విమర్శలు చేస్తున్న టిడిపి పార్టీ నుండే గణేష్ టిక్కెట్ ఆశించడం గమనార్హం.
అందుకోసం గణేష్ ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇందుకు అతను జూనియర్ ఎన్టీఆర్ను రంగంలోకి దింపారనే ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ అధిష్టానం వద్ద ప్రస్తావించారా లేదా అనే విషయం తెలియనప్పటికీ టిడిపిలో మాత్రం గణేష్ టిక్కెట్ గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయట. గణేష్ 2014 ఎన్నికలలో మహబూబ్నగర్ జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారని అంటున్నారు.
టిక్కెట్ ఆశిస్తున్న గణేష్కు టిక్కెట్ ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు అనే రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి దానిని నేతలెవరూ అంతగా పట్టించుకోవడం లేదట. అయితే 2009కి ముందు సూర్యప్రకాశ్ రావు మీద నాదర్ భూముల అంశంపై రాద్ధాంతం చేసిన టిడిపి, ఆ తర్వాత అతనికే అనకాపల్లి టిక్కెట్ ఇచ్చింది. ఇప్పుడు గణేష్ టిక్కెట్ విషయంలోనూ అదే రిపీట్ అవుతుందా కాదా చూడాలి.