చిరంజీవి ఓట్లు కాంగ్రెసుకు పడలేదా?
ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత కాంగ్రెసు ఓట్లు పెరగాల్సి ఉండగా, ఆ ఓట్లు మరింతగా తగ్గాయని ఆ పత్రిక తేల్చి చెప్పింది. కోవూరునే ఉదాహరణగా తీసుకుంటే 2009 ఎన్నికల్లో కాంగ్రెసుకు 65,786 ఓట్లు రాగా ప్రజారాజ్యం పార్టీకి 22,624 ఓట్లు వచ్చాయి. విలీనం తర్వాత ఈ ఓట్లన్నీ కాంగ్రెసుకు రావాల్సి ఉంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెసుకు 41,397 ఓట్లు మాత్రమే వచ్చాయి. మహబూబ్నగర్లో మాత్రం పరిస్థితి కాస్తా మెరుగ్గా కనిపిస్తోందని ఆ పత్రిక చెప్పింది.
ఆ పత్రిక అందించిన వివరాల ప్రకారం - 2009 ఎన్నికల్లో కొల్లాపూర్లో కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీలకు వచ్చిన ఓట్లు 65,927 కాగా, ఇప్పుడు కాంగ్రెసుకు వచ్చిన ఓట్లు 43,083. మహబూబ్నగర్లో రెండు పార్టీలకు అప్పుడు వచ్చిన ఓట్లు 33,632 కాగా, ఇప్పుడు కాంగ్రెసుకు వచ్చిన ఓట్లు 25,333 ఓట్లు. ఈ రకంగా ఏడు నియోజకవర్గాల్లో 2009లో ప్రజారాజ్యం, కాంగ్రెసు పార్టీలకు వచ్చిన ఓట్లను కలిపి చూపి ఇప్పుడు వచ్చిన ఓట్లను ఆ పత్రిక చూపి బేరీజు వేసింది.
అయితే, 2009 ఎన్నికల్లో వైయస్ రాజశేఖర రెడ్డి నాయత్వాన్ని, ఇప్పుడు వైయస్ జగన్ ప్రత్యేకంగా పార్టీ పెట్టుకున్న విషయాన్ని, ప్రజారాజ్యం పార్టీకి ఓటేస్తే చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారనే ఓటర్ల అభిమతాన్ని పత్రిక పరిగణనలోకి తీసుకోలేదు. అంతేకాకుండా, కాంగ్రెసు పార్టీ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.