చిరంజీవితో పాటు ఆ ఇద్దరు: తెలంగాణకు ఒకటే
ఈ మార్పులు చేర్పులలో భాగంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ సభ్యుడు, రాష్ట్ర కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత చిరంజీవిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. చిరంజీవిని మన్మోహన్ సింగ్ కేబినెట్లోకి తీసుకోవడం ఖాయమని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనతో ఇద్దరు తెలంగాణ నేతలకు మంత్రి పదవులు ఇస్తారనే ప్రచారం తొలుత జరిగింది. కానీ ఇద్దరికి కాకుండా ఒక్కరికే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎప్పటి నుండో నిరీక్షిస్తున్న ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావును మంత్రి పదవి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావూరితో పాటు గుంటూరు పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావులు ఎప్పటి నుండి మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. విస్తరణ, మార్పులు చేర్పులు జరిగిన ప్రతిసారి వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఈసారి కావూరికి మంత్రి పదవి ఇవ్వాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందని ఢిల్లీలో చెవులు కొరుక్కుంటున్నారు. రాయపాటికి టిటిడి చైర్మన్ పదవి లేదా ఇతర ఏమైనా పదవులను కట్ట బెట్టే అవకాశముందని అంటున్నారు. తద్వారా ఎన్నాళ్లుగానో ఉన్న వారిలోని అసంతృప్తిని తగ్గించాలని అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. ఇక తెలంగాణ ప్రాంతం నుండి అధిష్టానానికి ఎప్పుడూ అనుకూలంగా ఉంటూ వస్తున్న సర్వే సత్యనారాయణ పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కావూరి, సర్వే సత్యనారాయణలను ఇటీవలే రాహుల్ గాంధీ పిలిపించుకొని మాట్లాడారు. చిరంజీవితో పాటు కావూరి, సర్వేల పేర్లను పరిశీలిస్తున్నప్పటికీ ఆఖరులో మార్పులు జరిగే అవకాశాలు కూడా కొట్టిపారేయలేమని చెబుతున్నారు. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన తేదీలు సాధ్యమైనంత త్వరలో ఖరారు చేస్తారని చెబుతున్నారు.