నీకిది నాకది: నిమ్మగడ్డతో జగన్ బంధం?
ఆ బంధంలో వాన్ పిక్ కూడా ఒకటి అని తెలుస్తోంది. వాన్ పిక్ ప్రాజెక్టులో రస్ ఆల్ ఖైమా ఓ పాత్రధారి మాత్రమేనని, అసలు సూత్రధారులు వేరు అని తెలుస్తోంది. వాన్పిక్ పైన రస్ ఆల్ ఖైమా ప్రభుత్వానికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మొదట ఒప్పందం జరిగిందని, ఆ తర్వాత అందులో భారత భాగస్వామిగా మ్యాట్రిక్స్ చేరుకుందని తొలుత వినిపించింది. కానీ మ్యాట్రిక్స్ కోసమే రస్ ఆల్ ఖైమా రంగంలోకి దిగిందనేది తాజాగా వెలుగులోకి వచ్చింది.
2008 జనవరిలో మ్యాట్రిక్స్ ఎన్ పోర్ట్ హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ను నిమ్మగడ్డ ప్రసాద్ ఏర్పాటు చేశారు. రస్ ఆల్ ఖైమా సలహాదారుడిగా పేర్కొంటూ ఎ.జె.జగన్నాథన్ అదే ఏడాది ఫిబ్రవరి 12న నిజాంపట్నంలో పోర్టు నిర్మాణం, పారిశ్రామిక కారిడార్ఏర్పాటుకు ఆసక్తి చూపుతు పెట్టుబడులు, మౌలిక వసతుల ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. ఈ జగన్నాథన్ ఇందూ ప్రాజెక్ట్ డైరెక్టర్లలో ఒకరు. మరొకరు నిమ్మగడ్డ కావడం గమనార్హం.
అప్పుడు జనవరిలో మ్యాట్రిక్స్ ఎన్ పోర్టు ఏర్పాటైతే మార్చిలో వాన్ పిక్ ప్రాజెక్టు కోసం రస్ ఆల్ ఖైమాతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అదే నెలలో చివరలో వాన్ పిక్ మ్యాట్రిక్స్ చేతిలోకి వెళ్లిపోయింది. ఆగమేఘాల మీద సాగిపోయిన ఈ వ్యవహారం వెనుక సిబిఐ లోతుగా పరిశోధన చేసినపుడు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయని తెలుస్తోంది. అప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కారణంగానే ఈ ప్రాజెక్టు త్వరితగతిన మ్యాట్రిక్స్ చేతికి వెళ్లిందనేది ఆరోపణ.
జగన్ సంస్థలలో నిమ్మగడ్డ పెట్టుబడులు పెట్టడం, జగన్ ప్రభావంతో నిమ్మగడ్డకు వైయస్ రాజశేఖర రెడ్డి అనేక ప్రయోజనాలు కల్పించడం వ్యూహాత్మకంగా, కుట్రపూరితంగా జరిగాయన్న విషయం సిబిఐ పరిశోధనలో తేలిందని సమాచారం. జగన్, నిమ్మగడ్డల మధ్య 2006 నుండి సంబంధాలు ఉన్నాయి. ఇందూ ప్రాజెక్టుకు 250 ఎకరాల భూమిని కేటాయించినందుకు ప్రతిఫలంగా అందులో డైరెక్టర్గా ఉన్న నిమ్మగడ్డ జగన్కు చెందిన కంపెనీలలో రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టారని తెలుస్తోంది.
అప్పటి నుండి జగన్ కంపెనీలలోకి నిమ్మగడ్డ పెట్టుబడులు కొనసాగాయి. దీనికి ప్రతిఫలంగా నిమ్మగడ్డ ప్రభుత్వం నుంచి అనేక రాయితీలు, ప్రతిఫలాలు పొందినట్లుగా సిబిఐ పరిశోధనలో వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. వాన్ పిక్ నిర్మాణానికి రస్ ఆల్ ఖైమా ఆసక్తి చూపుతూ లేఖ రాసినప్పటి నుంచి జరిగిన పరిణామాలు దీనిని బలపరుస్తున్నాయని అంటున్నారు. ఇందులోని కొన్ని అంశాలన్ని తాజాగా దాఖలు చేసిన ఛార్జీషీటులో కూడా సిబిఐ పొందుపరిచినట్లు సమాచారం.