వైయస్ జగన్, చంద్రబాబు: రివర్స్ గేర్
తాము ఆరుగురు కాపులకు టికెట్లు ఇచ్చామని, కాపులు సొంత ఇంటికి రావాలని చంద్రబాబు బహిరంగంగా పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ కాపులకే అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రకటించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో తెలుగుదేశం, కాంగ్రెస్ల నుంచి పెద్ద సంఖ్యలో కాపులు ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత కాపులను తమ పార్టీ వైపు వైపు ఆకర్షించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్న చదలవాడ కృష్ణమూర్తిని తమ పార్టీలోకి తీసుకుని తిరుపతి టికెట్ ఇచ్చారు.
విజయవాడ నాయకుడు వంగవీటి రాధాకృష్ణను తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే, విజయవాడ రాజకీయాల కారణంగా ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. సొంత సామాజిక వర్గం మద్దతుతో పాటు ఇతర సామాజిక వర్గాల మద్దతు కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. వైయస్ జగన్ రెడ్డి కాదనే విషయాన్ని తెలుగుదేశం నాయకులు వ్యాఖ్యానించారు. ఇటు రెడ్లను, కాపులను తమ వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
కాపులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు ఉప ఎన్నికల్లో కోస్తాలోని రెండు నియోజకవర్గాల్లో, రాయలసీమలో నాలుగు నియోజకవర్గాల్లో కాపులను పోటీకి నిలబెట్టారు. మరోవైపు జగన్ కొంత మంది కమ్మనాయకులను ఆకట్టుకోవడం ద్వారా వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాల నాయకునిగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో జయాపజయాల మాట ఎలా ఉన్నా కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు ఆకర్షిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రయోజనం పొందవచ్చునని తెలుగుదేశం నాయకత్వం భావిస్తోంది.