దాసరి నారాయణ రావుకు జగన్ పార్టీ గాలం

కాపు ఓట్లపై కన్నేసిన జగన్ పార్టీ ఆ సామాజిక వర్గానికి చెందిన దాసరిని తమ పార్టీలోకి రప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. దాసరి ఇన్నాళ్లు కాంగ్రెసులో ఉన్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు. దీంతో ఆ పార్టీలో దాసరికి కాపు ఓటు పరంగా ప్రాధాన్యత తగ్గిందని అంటున్నారు. దీంతో దాసరిని తమ వైపుకు రప్పించుకుంటే కాపులు తమ వైపుకు వస్తారని జగన్ పార్టీ భావిస్తోందని అంటున్నారు.
ఇద్దరు మాజీ రాజ్యసభ సభ్యులు ఇప్పటికే దాసరితో జగన్ పార్టీలో చేరే విషయమై చర్చించారట. పార్టీలోకి వస్తే రాజ్యసభ సీటు ఇస్తామని కూడా జగన్ పార్టీ ఆఫర్ చేసిందని తెలుస్తోంది. ఇటీవల రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెసు దాసరిని విస్మరించిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు ఇటు కాంగ్రెసు కదలికలపై, అటు దాసరి అసంతృప్తిపై గమనిస్తోందని అంటున్నారు.
దాసరి కనుక తమ పార్టీలోకి వస్తే 2014 ఎన్నికలలో కాపు ఓట్లను తమ వైపు మళ్లించేందుకు బాగా ఉపయోగపడతారని వైయస్సార్ కాంగ్రెసు లెక్కలు వేస్తోందట. ఓ మాజీ ఎంపీ దాసరిని జగన్ వైపు తీసుకు వచ్చేందుకు ఒప్పించే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారట. ఇప్పటికే సదరు మాజీ ఎంపీ తనయుడు అమెరికాలో వైయస్సార్ యూత్ కాంగ్రెసు యూనిట్ను ఏర్పాటు చేసి, 2014లో జగన్ ముఖ్యమంత్రిని చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారట.
జగన్ పార్టీలో చేరేందుకు దాసరి పెద్దగా విముఖత చూపించినా, చూపించక పోయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటున్నారు. నందమూరి కుటుంబంతో ఉన్న మంచి సంబంధాల నేపథ్యంలో దాసరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారని కూడా గతంలో భావించారు. స్వర్గయ నందమూరి తారక రామారావుతో పలు చిత్రాలు తీసిన దాసరికి ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. బాలకృష్ణతే ప్రత్యేక సాన్నిహిత్యం ఉంది. కానీ అతను టిడిపిలో చేరలేదని పలువురు గుర్తు చేస్తున్నారు.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో కాపులు వైయస్సార్ కాంగ్రెసు వైపు మొగ్గారని, దాసరి కూడా కాపు కమ్యూనిటీలో పాపులారిటీ ఉన్న నేత అని, ఆయన పాపులారిటీని ఉపయోగించుకొని మరింత లబ్ధి పొందాలని జగన్ పార్టీ చూస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ పార్టీ ఇప్పటికే రెడ్డి పార్టీగా దాదాపు ముద్ర పడిపోయింది. దీంతో రెడ్లు తమ వెంట నడుస్తారని జగన్ భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆయన ఆంధ్రాలో అధికంగా ఉన్న కాపు సామాజిక వర్గంపై దృష్టి సారించారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications