జగన్కు కౌంటర్: ప్రభుత్వంపై బాబు అవిశ్వాసం?

మహబూబ్నగర్ జిల్లా నేతలతో చంద్రబాబు జరిపిన సమీక్షా సమావేశంలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన అంశం చర్చకు వచ్చింది. ఒకవేళ అవిశ్వాసం నెగ్గితే అక్టోబర్లోనే ఎన్నికలకు పోవాల్సి ఉంటుందని కూడా అంచనా వేశారు. కృష్ణాజిల్లాలో రెండవ విడత పాదయాత్ర జరుపుతున్న ఆయనను మహబూబ్నగర్ జిల్లా నేతలు కలిశారు.
ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రావుల చంద్రశేఖర్రెడ్డి, రేవంత్రెడ్డి, చంద్రశేఖర్, జైపాల్యాదవ్, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, జిల్లా పార్టీ పరిశీలకుడు వేం నరేందర్రెడ్డి తదితరులు మోపిదేవి గ్రామం వచ్చి గురువారంనాడు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన అంశాన్ని అధినేత ముందు ప్రస్తావించారు. పాదయాత్ర ముగిసే నాటికి అవిశ్వాస తీర్మానం అసెంబ్లీలో చర్చకు వచ్చేలా చేసి అక్కడి నుంచే నేరుగా అసెంబ్లీలో జరిగే చర్చకు వెళితే బాగుంటుందని కొంతమంది నాయకులు చంద్రబాబుకు సూచించారు.
మార్చి 13 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న విషయాన్ని ఎమ్మెల్యేలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశాల్లో కిరణ్కుమారెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ పార్టీ పెట్టిన తీర్మానానికి మద్దతిచ్చేకంటే తమ పార్టీనే అవిశ్వాస తీర్మానం పెడితే బాగుంటుందని సీనియర్ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు సూచించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications