బాబు వ్యూహం ఎదురు తిరుగుతుందా?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని తన పాదయాత్రలో అంటున్న చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ఎందుకు వెనకాడుతున్నారనేది ప్రశ్నగా మిగులుతోంది. తాము ప్రతిపాదించే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం ఇష్టం లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించవచ్చునని, తాము తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించే అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని తెరాస నాయకులు స్పష్టంగా చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రతిపాదిస్తే తాము మద్దతు ఇస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంటోంది.
అయితే, బ్లాక్ మెయిల్ కోసం తెరాస, లాలూచీ కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని తెర మీదికి తెచ్చాయని చంద్రబాబు అంటున్నారు. తోకపార్టీలతో కలిసి తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబోమని ఆయన చెబుతున్నారు. అవినీతి ప్రభుత్వానికి ప్రజాకోర్టులోనే సమాధానం చెప్తామని ఆయన అన్నారు. దీన్ని బట్టి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి చంద్రబాబు సిద్ధంగా లేరని స్పష్టంగానే తెలిసిపోతుంది. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి కలిగే రాజకీయ ప్రయోజనం ఏమీ లేదు.
అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించకపోగా, ఇతర పార్టీలు పెట్టే తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని చెప్పడం ద్వారా వైయస్సార్ కాంగ్రెసు, తెరాస తెలుగుదేశం పార్టీపై మరింతగా దాడిని పెంచే అవకాశాలున్నాయి. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి, వైయస్సార్ కాంగ్రెసు, తెరాసల వైఖరులను ఎండగట్టే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు ఎందుకు వాడుకోవడం లేదనేది ప్రశ్న. తెరాస బ్లాక్ మెయిల్ చేసి, జగన్ లాలూచీ పడి, తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానంపై గట్టిగా నిలబడకపోతే ఆ పార్టీలను ప్రజల ముందు నిలబెట్టే అవకాశం చంద్రబాబుకు ఉంటుంది. దీన్ని వాడుకోవడానికి ఆయన ఎందుకు ఇష్టపడడం లేదనేది ప్రశ్నగానే మిగిలింది.
కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగానే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, తాము కాంగ్రెసు వ్యతిరేక వైఖరిని అవలంబిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతగా చెప్పుకున్నా ప్రజలు నమ్మలేని స్థితి ఉందని అంటున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం ద్వారా కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస ఏ విధంగా కుమ్మక్కయ్యాయో నిరూపించడానికి అవిశ్వాస తీర్మానం ఉపయోగపడుతుందనే విషయాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని అంటున్నారు. దీంతో ఆయన అనుసరించే వైఖరి ఎదురు తిరిగే ప్రమాదం ఉందని అంటున్నారు.
కాగా, అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినా ప్రభుత్వానికి ఏ విధమైన డోకా లేకుండా చూసుకునేందుకు కాంగ్రెసు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది. క్రమశిక్షణ ఉల్లంఘించిన శాసనసభ్యులపై ఒకటి, రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. దీన్ని బట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వైపు వెళ్లిన శానససభ్యులపై అనర్హత వేటు వేసేందుకు తగిన ఏర్పాట్లు జరిగినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications