జగన్ పార్టీ వర్సెస్ కాంగ్రెసు: వైయస్ ఎవరివాడు?
కాంగ్రెస్ పార్టీ వైఎస్కు అవకాశం ఇవ్వబట్టే ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని, వైయస్తో పాటు రోశయ్య, డిఎస్, పి.జనార్దన్రెడ్డి, నేదురుమల్లి వంటి సీనియర్లు రేసులో ఉన్నప్పటికీ, నాయకత్వం వైయస్ వైపే మొగ్గు చూపిందని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. అధికారంలోకి రావడంలో వైఎయస్తో పాటు డి.శ్రీనివాస్ పాత్ర కూడా ఉన్నప్పటికీ, ఆయనను కాదని కూడా వైయస్కే రెండుసార్లు సీఎం ఇచ్చిందని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది.
జగన్, విజయలక్ష్మి, వివేకా నందరెడ్డితోపాటు పులివెందుల, కడప జిల్లాలో అనేక పదవులు అనుభవించిన వైయస్సార్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీనే పదవుల భిక్ష పెట్టిందని గుర్తు చేస్తోంది. దేశం, రాష్ట్రంలో ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమం త్రులు మృతి చెందితే ఒక్కరికీ వారిపేరుతో జిల్లాకు పేరు పెట్ట లేదని, కానీ వైయస్సార్ పేరును కడప జిల్లాకు పెట్టిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
వైయస్ మృతి చెందిన తర్వాత ఇక్కడకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సోనియా, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ వచ్చారని, దేశంలో ఏ ముఖ్యమంత్రికీ దక్కని విధంగా కాంగ్రెస్ వైఎస్ కుటుంబాన్ని గౌరవించిందని వాదిస్తున్నారు. అదే కాంగ్రెస్ చేసిన నేరమా అని ప్రశ్నిస్తోంది. వైయస్ ఉన్నప్పుడు అమలుచేసిన పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీవేనని, సోనియా అనుమతి తీసుకున్న తర్వాత ప్రకటించిన పథకాలేతప్ప, వైయస్ సొంత పథకాలు కాదని వాదిస్తున్నారు.
వైయస్ తమ నాయకుడేనని, జగన్కు తండ్రి అయినంత మాత్రాన ఆయన ఆస్తికే తప్ప, పార్టీకి వారసుడు కాలేడని కాంగ్రెసు నాయకులు మొదటి నుంచీ వాదిస్తున్నారు. జగన్ పార్టీలో వైయస్ సీఎం అయి వుంటే వైయస్ రాజశేఖరరెడ్డి పేరును ఆ వాడుకుంటే అభ్యంతరపెట్టేవాళ్లం కాదని, కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఎం కాబట్టే ఆయన తమ వాడవుతాడని స్పష్టం చేస్తున్నారు.
ప్రతిపక్షాల నాయకులతో పాటు కొంత మంది కాంగ్రెస్ నాయకులు వైయస్పై ఆరోపణలు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని వైయస్సార్ కాంగ్రెసు నేతలు కాంగ్రెసును నిలదీస్తున్నారు. వైయస్ పేరును ప్రస్తావించే నైతిక హక్కు, అర్హత కాంగ్రెస్కు లేదని వారంటున్నారు.