అమరావతి: గ్రాముల్లో భోజనం, ఒక్కొక్కరికి 60 ఖర్చు
హైదరాబాద్: అమరావతి శంకుస్థాపనకు వచ్చే ప్రజలు, వివిఐపీలకు తెలుగు రుచులు చూపించనున్నారు. ఇందుకోసం అన్నీ సిద్ధం చేశారు. రైతులు, సాధారణ ప్రజలకు కలిపి లక్షన్నర మందికి వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.60 చొప్పున దీనికి ఖర్చు చేస్తున్నారు.
ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రతి ఒక్కరి వద్దకు ఆహారం చేరేలా ప్రత్యేకమైన ప్యాకింగ్తో సిద్ధం చేస్తున్నారు. మహిళా వుంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, మృణాళినిలకు ఈ బాధ్యతలు అప్పగించారు. 21వ తేదీ అర్థరాత్రి నుంచి వంట ఏర్పాట్లు మొదలవుతాయి.
22న ఉదయం నుంచే ప్యాకింగ్ చేసి శంకుస్థాపన ప్రాంతానికి తీసుకెళ్తారు. సన్నాహకాల్లో భాగంగా మంగళవారం కొన్ని వంటకాలను వండించనున్నారు. విఐపీలకు వంటకాలు.. చక్కెర పొంగలి (100 గ్రాములు), పులిహోర (150 గ్రాములు), గారె ఒకటి, పూర్ణం బూరె ఒకటి, ఫ్రూటీ ఒకటి, మంచి నీళ్ల సీసా ఒకటి (500 ఎంఎల్) ఇస్తారు.
రైతులకు.. చక్కెర పొంగలి (75 గ్రాములు), పులిహోర (150 గ్రాములు), దద్దోజనం (150 గ్రాములు), తాపేశ్వరం కాజా ఒకటి, అరటి పండు ఒకటి, మంచినీళ్ల సాసాలు రెండు (200 ఎంఎల్) ఇవ్వనున్నారు. వీవీఐపీలకు ఆహారంతో పాటు స్నాక్స్గా పూర్ణం, డ్రైఫ్రూట్స్, కార్న్ సమోసా, రియల్ ఫ్రూట్ జ్యూస్ ఇస్తారు.
వీవీఐపీలకు శంకుస్థాపన జరిగే ప్రాంతంలోనే ప్రత్యేకమైన టెంట్ ఏర్పాటు చేశారు. వారికి ఆకలి పుట్టించే సూప్లు, చిరుతిళ్లు, భోజనం, భోజనానంతరం పళ్లు, ఇతర పదార్థాలు అందుబాటులో ఉంచుతారు. లెమన్ జ్యూస్, గ్రీన్సలాడ్, మొలకెత్తిన గింజలు, మొక్కజొన్న సలాడ్లతో పాటు భోజనం అందిస్తారు.
కొత్తావకాయ, గోంగూర, మిరియాల రసం, మెంతీ మజ్జిగ, వంకాయ పచ్చిపులుసు, కొబ్బరి చట్నీ, పచ్చి జామకాయ పచ్చడి, కరివేపాకు కారం, కొబ్బరి శనగకారం, అప్పడాలు, బెల్లం-తేనె జిలేబీ, నేతిబొబ్బట్లు అందిస్తారు. వివిధ రకాల పండ్లు, మూడు రకాల ఐస్క్రీమ్లు, మిఠాయి కిళ్లీ, సాధారణ కిళ్లీలు ఇస్తారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హెలికాప్టర్లో వెళ్లనున్నారు. తొలుత రోడ్డు మార్గంలో వెళ్లాలని భావించినా వాహన రద్దీ దృష్ట్యా హెలికాప్టర్లో వెళ్లాలని భావిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ వైమానిక అధికారులకు సీఎం కార్యాలయం నుంచి సమాచారమిచ్చారు. ఏపీ సీఎం కార్యాలయానికి, పోలీసు అధికారులకు సైతం తెలంగాణ సీఎంవో నుంచి ఈమేరకు సమాచారం ఇచ్చారు.
ఇదిలా ఉండగా, శంకుస్థాపనకు రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో వేదికను చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. సమీప గ్రామాలతోపాటు పల్నాడు నుంచి కూడా ప్రజలు భారీగా వచ్చి చేపడుతున్న ఏర్పాట్లను ఆసక్తిగా తిలకిస్తున్నారు.
శంకుస్థాపన జరిగే రోజు దగ్గరినుంచి చూసే అవకాశం ఉండదన్న ఉద్దేశంతో ముందుగా వస్తున్నారు. వేదిక పనులు సోమవారం నాటికి ఒక కొలిక్కి రావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. వారిలో ఎక్కువ మంది సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.
ప్రధాన వేదిక, ఉపవేదికలు, యాగశాల, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వేదిక పనులు పూర్తయ్యాయి. ప్రధాన వేదిక సమీపంలోనే వీవీఐపీలు, వీఐపీలు, రాజధాని రైతులు కూర్చునే పందిళ్లు సిద్ధమయ్యాయి. ఇందులో కుర్చీలు వేసే పనులు జరుగుతున్నాయి.
ప్రజల గ్యాలరీల్లోనూ కుర్చీలు వేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సభా ప్రాంగణానికి చేరుకున్న పోలీసులకు తాము వ్యవహరించాల్సిన తీరుపై ఒంగోలు ఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో శిక్షణనిచ్చారు. ఏర్పాట్లు చివరి దశకు చేరుకోవడంతో ప్రాంగణం పోలీసు రక్షణలోకి వెళ్లింది.
ప్రధాన వేదిక వైపు సందర్శకులు వెళ్లకుండా దూరం నుంచి చూసి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి ప్రధాని హాజరవుతుండటంతో ఇప్పటికే ఒకసారి వచ్చిన ఎస్పీజీ బృందం సోమవారం మరోసారి పర్యవేక్షించింది. ప్రధాన వేదిక సమీపంలో మనమట్టి, మననీరు నిల్వ చేయనున్నారు.
మంగళ, బుధవారాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. శంకుస్థాపన రోజు ఇక్కడ ఎలాంటి కార్యక్రమం చేపట్టరు. దీంతో కలశాలు, మట్టి నిల్వచేసే ప్రాంతంలో పోలీసులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.












Click it and Unblock the Notifications