ఎపి ఉద్యోగుల గొడవ: హైదరాబాద్ ప్లాట్స్, స్థానికత
హైదరాబాద్: తాము కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి వెళ్తే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమకు కేటాయించిన స్థలాలు ఏమవుతాయనే ఆందోళన ఎపి ఉద్యోగులను పట్టుకున్నట్లు అర్థమవుతోంది. తమ ప్లాట్లను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలను తీసుకుని, తమకు వాటి విషయంలో తమకు గ్యారంటీ ఇస్తే అమరావతికి మారడానికి సిద్ధమేనని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు అంటున్నారు.
ప్రభుత్వోద్యోగులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో గచ్చిబౌలిలో విలువైన స్థలాల కేటాయింపు జరిగింది. తాము అమరావతికి మారేలోగా ఆ ప్లాట్లను తమ పేర్ల మీదికి మార్చాలని వారు అడుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరగడంతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు వారి రాజధానిలోనే ప్లాట్లు కేటాయించాలని తెలంగాణ ఉద్యోగులు వాదిస్తున్నారు.

అందుకు సంబంధించిన కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగులో ఉంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన తొమ్మిది ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి ఐవైఆర్ కృష్ణారావు బుధవారం చర్చలు జరిపారు. రాజధాని మార్పునకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని, హైదరాబాదులో పనిచేస్తున్న ఉద్యోగుల వ్యక్తిగత ఇళ్లపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు.
హైదరాబాదులో తాము స్థిరపడిపోయామని, తమ జీవిత భాగస్వాములు హైదరాబాదులో ఉద్యోగాలు చేస్తున్నారని, తమ పిల్లలు ఇక్కడే చదువుతూ స్థానిక హోదా పొందారని, ఈ విషయాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలని వారంటున్నారు.
టర్కీ పర్యటన నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే పలు అంశాలపై స్పష్టత ఇస్తామని కృష్ణారావు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఆ రాష్ట్రంలో స్తానిక హోదా కల్పించాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతామని కృష్ణారావు చెప్పారు.












Click it and Unblock the Notifications