వారే టార్గెట్గా దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లు: అంతకుముందే కొండల్లో పేల్చారు!
దిల్సుఖ్నగర్లో జంట పేలుళ్లకు ముందు ఐఎం ఉగ్రవాదులు అబ్దుల్లాపూర్మెట్ సమీపంలోని గుట్టల్లో బాంబు పేలుళ్ల పరీక్షలు నిర్వహించారు.
హైదరాబాద్: ఫిబ్రవరి 21, 2013న నగరంలోని దిల్సుఖ్నగర్లో జంట పేలుళ్లు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, అంతకుముందే ఉగ్రవాదులు మరో చోట పేలుళ్లకు పాల్పడ్డారు. ఇది చాలా మందికి తెలియని ఘటన. హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్మెట్కు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని కొండల్లో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు పాల్పడ్డారు.
దిల్సుఖ్నగర్లో జంట పేలుళ్ల ఘటనపై దర్యాప్తు జరిపిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఈ విషయాన్ని వన్ఇండియాకు తెలిపారు. మొదట కొండల్లో పేలుళ్లకు పాల్పడిన అనంతరం యాసిన్ భత్కల్, అతని అనుచరులు దిల్సుఖ్నగర్లో జంట పేలుళ్లకు పాల్పడ్డారని చెప్పారు.
దిల్సుఖ్నగర్లో జంట పేలుళ్లకు ముందు బాంబులను పరీక్షించడం కోసమే ఉగ్రవాదులు కొండల్లో మొదట పేలుళ్లు జరిపినట్లు తెలిపారు. అబ్దుల్లాపూర్మెట్లో బస చేసిన యాసిన్ భత్కల్, అతని అనుచరులు.. అక్కడికి 5కిలోమీటర్ల దూరంలోని గుట్టల్లో బాంబులను పరీక్షించారని తెలిపారు. ఆ తర్వాత దిల్సుఖ్నగర్లో జంట పేలుళ్లకు పాల్పడ్డారు ఈ ఉగ్రవాదులు. ఈ పేలుళ్లలో 19మంది మరణించగా, 131మంది గాయాలపాలయ్యారు.
అంతేగాక, పేలుడు ఘటనకు ముందు రెండ్రోజులపాటు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. కొద్ది గంటలపాటు వేచి చూసిన తర్వాత ప్రజలు ఎక్కువగా ఉన్న సమయంలోనే ఉగ్రవాదులు బాంబులను పేల్చారని చెప్పారు. హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టే.. వారే లక్ష్యంగా ఇక్కడ తాము పేలుళ్లకు పాల్పడ్డామని ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఎన్ఐఏ విచారణలో తెలిపినట్లు వెల్లడించారు.