సర్వే: బాబు నివాసం హైదరాబాదులోనే, ఆస్తులు..
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడకు మారినప్పటికీ ఆయన ఇంకా ఆయన హైదరాబాదులోనే ఉన్నట్లు ఆధార్ కార్డులో నమోదై ఉంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతూ దాన్ని బదిలీ చేయించుకోవాల్సి ఉందని చెప్పారు. తొలిరోజు శుక్రవారం స్మార్ట్ పల్స్ సర్వేను ముఖ్యమంత్రి ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రారంభించారు.
చంద్రబాబు వార్షికాదాయం రూ. 36 లక్షలుగా ఉన్నట్లు నమోదైంది. చంద్రబాబు సహా ఆయన ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్, ఓటర్ ఐడీ అన్నీ హైదరాబాద్లో ఉండగా స్థిర, చరాస్తులు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. మొదట ఎన్యుమరేటర్లు ముఖ్యమంత్రికి సంబంధించిన వివరాలు సేకరించారు. సిఎంగా తనకు వచ్చే ఆదాయం అన్నింటితో కలుపుకుని రూ. 36 లక్షలని చంద్రబాబు ఎన్యుమరేటర్లకు వివరించారు.

చిత్తూరుజిల్లాలోని తన స్వగ్రామం నారావాలిపల్లెలో స్థిర, చరాస్తులు ఉన్నాయని, అయితే వీటి వివరాలను తరువాత చెప్తానని తెలిపారు. సిఎం ఆధార్ కార్డు నెం. 300300688099, ఓటర్ ఐడీ నెం. ఎఫ్ఐవి 2036739 ప్రకారం ఎన్యుమరేటర్లకు వివరాలను వివరించారు.
అయితే ఓటర్ ఐడీతో పాటు ఆధార్ కార్డు హైదరాబాద్లో నివసిస్తున్నట్లుగానే ఉన్నందున వాటిని బదిలీ చేయించాల్సి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. సిఎం చెప్పిన కొన్ని వివరాలను నమోదు చేసుకున్న ఎన్యుమరేటర్లు పల్స్ ఏడబ్ల్యుకెపీ 202963 నెంబరుగా ప్రకటించారు.
ఉండవల్లి గ్రామ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రాజారాం అనే ఉద్యోగి ఎన్యుమరేటర్గా వ్యవహరించి సీఎం చంద్రబాబు వద్ద నుంచి స్మార్ట్ పల్స్ సర్వే వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కాంతిలాల్ దండె సహకరిస్తూ సీఎం చంద్రబాబుకు స్వయానా ఐరిష్ నమోదుతో పాటు వేలిముద్రలను స్వీకరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ నుంచి కూడ సిబ్బంది పల్స్ సర్వే వివరాలను సేకరించారు. సర్వే సిబ్బంది వివరాల నమోదు ప్రక్రియ పూర్తయ్యాక సీఎం నివాసానికి తాత్కాలిక ఇంటి నెంబరుగా ఏడబ్ల్యూకేపీ 202963ను కేటాయించారు. కలెక్టరు ఆ స్టిక్కరును స్వయంగా ఇంటి డోర్కు అతికించారు.












Click it and Unblock the Notifications