దేవాన్షు కను విందు: చంద్రబాబు విందు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మనవడు దేవాన్ష్ తొలి పుట్టిన రోజు వేడుక ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా దేవాన్షు అతిథులకు కను విందు చేయగా, చంద్రబాబు విందు ఇచ్చారు.
నిరుడు ఉగాది రోజున దేవాన్ష్ జన్మించాడు. తిథి ప్రకారం దేవాన్ష్ తొలి పుట్టిన రోజును శుక్రవారం రాత్రి విజయవాడలోని ఎ-కన్వెన్షన్ హాలులో చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు చంద్రబాబు విందు ఇచ్చారు. సుమారు మూడు గంటలపాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం దేవాన్ష్ చిరునవ్వులతో సందడి చేశాడు.

ప్రముఖుల చేతులు మారుతూ వారితో కలిసి ఫొటోలకు ఫోజులు ఇస్తూ హల్చల్ చేశాడు. పలువురు ప్రముఖులు చిన్నారితో కలిసి ఫొటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. టీటీడీ వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. దేవాన్ష్ పుట్టిన రోజును ఆంగ్ల కేలండర్ ప్రకారం గత నెల 21న హైదరాబాద్లో చేశారు. అప్పట్లో కుటుంబసభ్యులను, సమీప బంధువులను మాత్రమే ఆహ్వానించి చంద్రబాబు విందు ఇచ్చారు.

ఈ విందుకు సుజనా చౌదరి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి వెంకయ్యతోపాటు ఆయన కుమార్తె దీపా వెంకట్ కూడా వేడుకకు వచ్చారు. పార్టీలో ముఖ్యులంతా కలసి ఒకేచోట భోజనం చేశారు.

దేవాన్ష్ తాత, నటుడు బాలకృష్ణ అందరినీ పలకరిస్తూ సందడి చేశారు. ఆహుతుల్లో చాలా మంది దేవాన్ష్తోను, లోకేశ్, బాలకృష్ణ, చంద్రబాబు దంపతులతోను ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపారు.












Click it and Unblock the Notifications