'కుల' వలయం: అపూర్వ సహోదరులు చిరు, పవన్
హైదరాబాద్: అవునన్నా, కాదన్నా తెలుగు సినీ, రాజకీయ సహోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాపు కుల వలయంలో చిక్కుకున్నారు. ఇతర సామాజిక వర్గాల మాటేమో గానీ కాపు సామాజిక వర్గం మాత్రం వారిని తమ వాడిగానే చూస్తోంది. కోస్తాంధ్రలో కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య వైరుధ్యం వల్లనే కాకుండా సినీ రంగంలోని వైరుధ్యాల వల్ల కూడా వారిద్దరికి ఆ ట్యాగ్ లేన్ వచ్చి చేరింది.
వారిద్దరు కూడా తమ తరఫున ఉంటారనే బలమైన నమ్మకం కూడా వారికి ఉంటూ వచ్చింది. అయితే, ప్రజారాజ్యం స్థాపన తర్వాత చిరంజీవి నుంచి కాపు సామాజిక వర్గం దూరమైనట్లు కనిపిస్తోంది. అదే సమయంలో పవన్ కల్యాణ్కు దగ్గరైనట్లు కనిపించింది. దాంతో పవన్ కల్యాణ్ మాట మీద కాపు సామాజిక వర్గం ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమికి అండగా నిలబడిందనే అభిప్రాయం ఉంది.
అయితే, ప్రస్తుతం చిరంజీవి కాపు సామాజిక వర్గం వైపు ఉన్నట్లు కనిపిస్తున్నారు. కాపు సామాజిక వర్గం సమస్యలపై ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాయడం ద్వారా ఆ విధంగా అనిపిస్తోంది. దాంతో చిరంజీవి తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి విమర్శలను ఎదుర్కుంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నుంచి టిడిపి నేత జూపూడి ప్రభాకర రావు వరకు చిరంజీవిని తప్పు పడుతున్నారు.
కాగా, పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం నుంచే అసంతృప్తిని ఎదుర్కుంటున్నారు. తాను ఒక్క కులానికి చెందినవాడిని కాదని అనిపించుకోవడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని భావించినప్పటికీ ఆయన తమ పక్కన ఉండాల్సిందే అనే పద్ధతిలో కాపు సామాజికవర్గం భావిస్తోంది. దానివల్లనే తుని సంఘటనలపై కర్ర విరగకుండా పాము చావకుండా మాట్లాడిన పవన్ కల్యాణ్పై కాపు సామాజిక వర్గం గుర్రుగా ఉంది.
కొన్ని ప్రాంతాల్లో కాపు యువకులు పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను చించేశారు కూడా. ముద్రగడ పద్మనాభం పెట్టిన కాపు ఐక్య గర్జన సభ సమయంలో ఫ్లెక్సీలపై, పోస్టర్లపై వంగవీటి రంగా చిత్రంతో పాటు పవన్ కల్యాణ్ చిత్రాలు కూడా చోటు చేసుకున్నాయి. పవన్ కల్యాణ్ను తమతో విడదీయరాని నాయకుడిగానే వారు చూస్తున్నారు. ఏమైనా, చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్రస్తుత తరుణంలో చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు.