లాస్ట్మినట్లో ఎన్కౌంటర్ టీంలో మృతిచెందిన నాగరాజు
నల్గొండ: నల్లగొండ జిల్లా ఎదురు కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్ నాగరాజు.. అడిగీ మరీ డ్యూటీకి వచ్చారంట. జానకీపురం ఎన్కౌంటర్ టీంలో అతను ఆఖరి క్షణంలో చేరాడని తెలుస్తోంది. సిమి కార్యకర్తలుగా భావిస్తున్న జకీర్, అస్లాం ఎన్కౌంటర్ కోసం భారీ చేజింగ్ జరిగిన విషయం తెలిసిందే. బైక్ పైన వెళ్తున్న దుండగులను పోలీసులు వెంబడించారు.
అంతకుముందు పోలీసు స్టేషన్ నుండి బయలుదేరే ముందు టీంలో నాగరాజు లేడని తెలుస్తోంది. వారు బయలుదేరే సమయంలో నేను కూడా వస్తానని అతను చెప్పారు. అతను తన నాలుగేళ్ల సర్వీసులోనే అందరికీ తలలో నాలుక అయ్యారు. కాల్పుల ఘటన సమయంలో నాగరాజు డ్రైవింగ్ సీటులో ఉన్నాడని తెలుస్తోంది. దుండగులు అతనిని పాయింట్ బ్లాక్లో కాల్చారు.

అతని తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అతనికి ఏడెనిమిది నెలల క్రితమే పెళ్లయింది. భార్య సంజన. తల్లిదండ్రులు శ్రీమన్నారాయణ, లక్ష్మమ్మ. నాగరాజుకు గాయాలు కాగానే అతనిని కామినేని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మృతి చెందారు. భార్య సంజన భర్త సహకారంతో బీఫార్మసీ చేస్తున్నారు. నాగరాజు మృతితో నల్లగొండ జిల్లాలోని ఆయన గ్రామంలో విషాదం అలుముకుంది.
నాగరాజు చదువులో ఎల్లప్పుడూ ముందుండేవారు. అయితే, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో డిగ్రీ పూర్తి కాగానే ఎస్సై ఉద్యోగ సాధనకు శిక్షణ తీసుకున్నారు. ఏపీఎస్పీ, సివిల్ కానిస్టేబుళ్ల ఉద్యోగ పరీక్షళకు హాజరై 2008లో ఏపీఎస్పీలో కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. రెండేళ్ల తర్వాత సివిల్ పోలీసు కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. అప్పటి నుండి ఆత్మకూరు ఎం స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications