డ్రగ్స్ ఉచ్చులో సినీ దర్శకుడు: ఎవరతను?
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఏ సినీ దర్శకుడి పేరు బయటకు వచ్చింది.
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఏ సినీ దర్శకుడి పేరు బయటకు వచ్చింది. అయితే, అతని పేరు చెప్పడానికి సంబంధిత అధికారులు ఇష్టపడడం లేదు. ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు మాత్రం చెబుతున్నారు.
ఓ నిర్మాతకు సంబంధం ఉన్నట్లు అధికారులు ఇది వరకే చెప్పారు. తాజాగా, దర్శకుడి పేరు కూడా ముందుకు రావడంతో టాలీవుడ్లో కలకలం చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన కెల్విన్తో ఆ దర్శకుడు సంబంధాలు పెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
కెల్విన్ కాల్ డేటాను పరిశీలించడంతో ఆయన పేరు బయటపడినట్లు చెబుతున్నారు. తక్కువ సినిమాలతో ఆ దర్శకుడు మంచి పేరు సంపాదించుకున్నట్లు ప్రచారంలో ఉంది. కెల్విన్తో నిత్యం సంబంధాలు నెరుపుతున్న నిర్మాత మానసిక ఒత్తిడికి గురవుతున్న ఆ దర్శకుడికి కెల్విన్ను పరిచయం చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెబుతున్నారు.
ఏడాదికో సినిమా తీస్తూ....
ఏడాదికో పాటు ఆ దర్శకుడు సినిమా తీస్తున్నట్లు, అతను డ్రగ్స్ తీసుకోవడం ఏమిటని అధికారులు విస్మయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎల్సిడ డ్రగ్ను ఆ దర్శకుడు తన కోసమే తసుకున్నాడా, మరెవరి కోసమైనా కొనుగోలు చేశాడా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తొలుత ఏడుగురికి మాత్రమే కెల్విన్ నుంచి మత్తుపదార్థాలు అందినట్లు అధికారులు భావించారు. కాన వందల సంఖ్యలో డ్రగ్స్ బానిసలున్నట్లు తేలిందని అధికారులు చెబుతున్నారు.
ఇంటి ముందు ఖరీదైన కార్లు..
హైదరాబాదులోని ఓల్డ్ బోయిన్పల్లిల నివసించే కెల్విన్ ఇంటి ముందు ప్రతి రోజూ ఖరీదైన కార్లు, ప్రముఖుల హడావిడి ఉండేదని అధికారులు చెబుతున్నారు. స్కూల్ విద్యార్థుల నుంచి బహుళజాతి సంస్థ ఉద్యోగులు, సినీ ప్రముఖులు అతని నుంచి డ్రగ్స్ తీసుకుని వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారని సమాచారం. తాను ఇంటి వద్ద మాత్రమే డ్రగ్స్ అమ్ముతానని, తన వద్దకు వచ్చి వాటిని తీసుకుని వెళ్లాలని కెల్విన తన కస్టమర్లకు చెప్పేవాడని అంటున్నారు.
స్కూళ్లు, కాలేజీలకు నోటీసులు....
కెల్విన్ ద్వారా ఆన్లైన్లో డ్రగ్స్కు బానిస అయిన ఓ విద్యార్థిని చదువుతున్న స్కూల్తో పాటు మరో నాలుగు ఇంటర్నేషనల్ స్కూళ్లకు నోటీసులు జారీ చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సోమవారం మీడియాకు చెప్పారు. మరో 8 ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఆ నాలుగు ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదువుతున్న ఆరుగుు విద్యార్థులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
ఇలా ప్రశ్నలు.....
ఎవరు ముందుగా మత్తుపదార్థాలకు అలవాటయ్యారు, వారి నుంచి ఇతరులకు ఎలా పాకింది, ఎవరు డ్రగ్స్ అందించారు, కెల్విన్తో ఎలా పరిచయమైంది వంటి ప్రశ్నలను అధికారులు విద్యార్థులకు వేసినట్లు తెలుస్తోంది. నోటీసులు జారీ చేసిన ఇంజనీరింగ్ విద్యార్థుల తల్లిదండ్రులను అధికారులు ముందే ప్రశ్నించారు. అబ్దుల్ వహీబ్, అబ్దుల్ ఖుదూస్లతో ఉన్న సంబంధాలేమిటని కూడా అడిగినట్లు సమాచారం.