ఐఎఎస్ రవి మృతి: సిబిఐ దర్యాప్తులో డ్రైవర్ కీలకం
బెంగళూరు: కర్ణాటక ఐఎఎస్ అధికారి డికె రవి అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తులో డ్రైవర్ కీలకం కానున్నట్లు తెలుస్తోంది. మృతికి దారి తీసిన కారణాలపై రవి డ్రైవర్ ఇలాంగోవన్ ద్వారా కీలకమైన విషయాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
సిసిటీవి ఫుటేజీలో కొన్ని భాగాలను మాయం చేశారని రవి మామ హనుమంతరాయప్ప ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సిఐడి అధికారులు ఆ భాగాలను మాయం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సోమవారం ఉదయం నగరభావిలోని తన మామ ఇంటికి వెళ్లిన సమయంలో, తిరిగి బయటకు వచ్చిన సమయంలో రవి ఏ విధమైన భావోద్వేగాలతో ఉన్నాడనే విషయాలు ఆ ఫుటేజీ దృశ్యాలు వెల్లడించే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఉదయం పదిన్నర గంటలకు కోరమంగళలోని కార్యాలయానికి చేరుకోవడానికి నగరబావిలోని ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత 11 గంటలకు సెయింట్ జాన్స్ వుడ్ అపార్టుమెంటులోని 9వ అంతస్థుకు చేరుకున్నట్లు సిసిటీవీ ఫుటేజీలు తెలియజేస్తున్నాయి.
హనుమంతరాయప్ప ఇంటిలోని సిసిటీవీ ఫుటేజీలోని మాయమైన దృశ్యాలు రవి ప్రతి నిమిషం కదలికలను పట్టిచ్చే అవకాశం ఉండింది. ఆ సిసిటీవీ ఫుటేజీలోని కొన్ని దృశ్యాలను మాయం చేయడం ద్వారా ఆశించిన ఫలితం ఏమిటనేది అర్థం కావడం లేదు.
సిసిటీవీ ఫుటేజీలు మాయమైనట్లు చేసిన ఆరోపణలపై హనుమంతరాయప్పను సిబిఐ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి రవి భార్యతో పాటు ఆమె సమీప బంధువు తొలుత చేరుకున్నారు. దీంతో వారిని కూడా సిబిఐ ప్రశ్నించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications