మాట మారుతోంది, మెలిక: మోడీ పిలిస్తే కవిత సిద్ధం
కరీంనగర్: కేంద్ర మంత్రి మండలిలోకి ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానిస్తే ఆలోచిస్తామని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత సోమవారం చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మోడీ కేబినెట్లో కల్వకుంట్ల కవిత చేరవచ్చుననే ఊహాగానాలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. గతంలోను ఆమె మాట్లాడుతూ... ప్రస్తుతం దాని గురించి ఆలోచించడం లేదని, ఇరు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరగడం లేదని, అయితే తెలంగాణ కొత్త రాష్ట్రమైనందున మరో ఇరవై ఏళ్లపాటు కేంద్రంతో సన్నిహితంగా ఉండాలని వ్యాఖ్యానించారు.
తాజాగా, మరికొంత ముందుకు జరిగారు. ఏకంగా.. మోడీ ఆహ్వానిస్తే కేబినెట్లో చేరే అంశంపై ఆలోచిస్తామని చెప్పారు. ఆమెను విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘ప్రధాన మంత్రి మోడీ తమ కేబినెట్లో చేరాలని ఆహ్వానిస్తే ఆలోచిస్తాం'' అని సమాధానమిచ్చారు.

అయితే, ప్రస్తుతానికి మాత్రం అలాంటి ఆలోచనలేవీ లేవన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకువచ్చేందుకు పార్టీ ఎంపీలమంతా కలిసి పని చేస్తున్నామని, అందులో భాగంగానే మోడీతో ఇతర మంత్రులనూ కలుస్తున్నామని వివరించారు.
ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పాదయాత్రను ఉద్దేశించి మాట్లాడుతూ... రైతుల కోసం రాజకుమారుడు రోడ్ల పైకి రావడం విడ్డూరంగా ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక రాష్ట్రాన్ని 45 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్, 15 ఏళ్లపాటు పాలించిన టీడీపీ ఇప్పుడు మాట్లాడటం విడ్డూరమన్నారు.
రైతుల ఆత్మహత్యలకు వ్యవసాయ సంక్షోభానికి వారే కారకులని ఆరోపించారు. రైతుల సంక్షేమానికి వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చి కృషి చేస్తోంది తమ ప్రభుత్వమే అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన కూడా ఆమె గాటైన వ్యాఖ్యలరు చేశారు.












Click it and Unblock the Notifications