ఢిల్లీ ఎన్నికలపై ఉత్కంఠ: సర్వేలు తలోమాట
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ మ్యాజిక్ మసకబారిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కారణం ఎబిపి న్యూస్-నీల్సన్ తాజా సర్వే ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. బీజేపీ - ఆప్ల మధ్య హోరా హోరీగా సాగుతున్న ఎన్నికల పోరులో కేజ్రీవాల్ దూసుకుపోతున్నారు. ఢిల్లీలో మరోసారి హంగ్ అసెంబ్లీ వస్తుందని ఈ ముందస్తు సర్వేలను చూస్తుంటే తెలుస్తోంది.
ఎన్నికలకు ముందు ఏ పార్టీ విజయం సాధిస్తుందో ముందుగా రాజకీయనాయకులకు తెలిపేవే సర్వేలు. ఈ సర్వేలు ఎంత కీలకమో గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో మనందరం చూశాం. ఫిబ్రవరి 7న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొన్నటి వరకు అన్ని సర్వేలు బీజేపీకే అనుకూలంగా ఉన్నాయి.
ఎబిపి న్యూస్-నీల్సన్ సర్వే:
అయితే... తాజాగా ఎబిపి న్యూస్-నీల్సన్ సర్వేలో అరవింద్ కేజ్రీవాల్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ 35 సీట్లు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని వెల్లడించింది. 29 స్ధానాలతో బీజేపీ రెండో స్ధానంలో నిలుస్తుందని, కాంగ్రెస్కు గత ఎన్నికల కంటే తక్కువగా ఈసారి ఆరు సీట్లు మాత్రమే రావచ్చని అంచనా వేసింది.
అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావాలని 48 శాతం మంది ఓటర్లు కోరుకోగా..... కిరణ్ బేడీ సీఎం కావాలి 42 శాతం ఓటర్లు కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. ఢిల్లీలోని బడుగు బలహీన వర్గాలు, ముస్లింలు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు సర్వేలో పేర్కొంది.
మొత్తం 70 స్థానాలకుగాను 35 నియోజకవర్గాల్లో జనవరి 25 నుంచి 31 మధ్య 6,396 మందితో అభిప్రాయ సేకరణద్వారా ఈ ఫలితాలు వెల్లడైనట్లు పేర్కొంది.
బీజేపీ అంతర్గతంగా చేసుకున్న సర్వే:
బీజేపీకి 32 సీట్లు వస్తాయని తెలిసినట్లుగా సమాచారం. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో మేజిక్ ఫిగర్ 36. అధికారం కోసం మరో నాలుగు సీట్లు తక్కువ కానున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఇతర రాష్ట్రాల్లో (జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, హర్యానా, మహారాష్ట్ర) వలే ఊపు ఉండకపోవచ్చునని చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాలు గెలుచుకుంటుందని ఆ పార్టీ సర్వేలో తెలినట్లుగా తెలుస్తోంది. దేశ రాజధానిలోని అర్బన్ ప్రాంతంలోనే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందంటున్నారు. పూర్వాంచల్లో 24 శాతం ఓట్లు ఉన్నాయి. ఇక్కడి ఓటర్లు ఏఏపీ వైపు మొగ్గు చూపుతున్నారు.
ది వీక్-ఐఎంఆర్బీ సర్వే:
ఢిల్లీలో బీజేపీ విజయబావుటా ఎగురవేస్తుందని ది వీక్-ఐఎంఆర్బీ సర్వేలో తేలింది. బీజేపీ 70 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే తెలిపింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావాలని 40 శాతం మంది ఓటర్లు కిరణ్ బేడీ సీఎం కావాలి 39 శాతం ఓటర్లు కోరుకుంటున్నారు.
ఇండియా టీవీ - సీ ఓటరు సర్వే:
ఈ సర్వేలో ఢిల్లీ ఓటర్లు బీజేపీకే పట్టం కడతారని తేలింది. ఇండియా టీవీ - సీ ఓటరు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో బీజేపీకి 37, ఆమ్ ఆద్మీ పార్టికి 28 సీట్లు వస్తాయని పేర్కొంది.
70 స్ధానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 7న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10న ఫలితాలు వెల్లడించనున్నారు. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లను గెల్చుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇక గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని 7 లోక్ సభ స్ధానాలను బీజేపీ గెలుచుకోవడం విశేషం.