సూసైడ్ నోట్ ఇలా: లేడీ క్రికెటర్ మృతి మిస్టరీనే!
విజయవాడ: మహిళా క్రికెటర్ దుర్గాభవాని ఆత్మహత్య మిస్టరీగా మారింది. దుర్గాభవాని సూసైడ్ నోట్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ నోట్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. సూసైడ్ నోట్లోని చేతిరాతపై అనుమానం వ్యక్తం చేశారు.
పూర్తిగా స్పృహలో ఉండి ఆత్మహత్యకు పాల్పడినట్టు లేఖలో రాసి ఉంది. స్పృహలో ఉన్నట్లు పేర్కొనడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరమైన రాతలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లలో ఉపయోగించే భాష సూసైడ్ నోట్లో ఉండటం ఈ అనుమానాలకు తావిస్తుంది. ఆర్థికంగా స్థిరపడిన దుర్గాభవాని ఆనూహ్యంగా మృతి చెందడంపై తోటి క్రీడాకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తన కెరీర్ ఉచ్ఛదశలో ఉన్నప్పుడు ఆమె క్రికెట్ క్రీడకు వీడ్కోలు చెప్పింది. లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆ కేసును ఉపసహరించుకుని విమర్శల పాలైంది. తనకు కోచ్గా వ్యవహరించిన మద్దినేని సత్యప్రసాద్ను రెండో వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె ఆటకు దూరమై గృహిణిగా కాలం గడుపుతూ వచ్చింది.

లైంగిక వేధింపుల కేసును ఆమె ఉపసంహరించుకోవడం వెనక పెద్ద కథ నడిచిందని అంటున్నారు. దుర్గా భవానీ గుణదలలోని ఓ అద్దె ఇంట్లో ఉండడంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతి కేసును పక్క దోవ పట్టించేందుకే ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుందనే పుకార్లను ప్రచారంలోకి తెచ్చారని అంటున్నారు.
సూసైడ్ నోట్లోని అంశాలపై, దస్తూరిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే లేఖలో తల్లిని, భర్తను ఉద్దేశించి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొనడం, భర్తకు పక్కన గారు అనే పేర్కొనడం వంటి విషయాలు సందేహానికి తావిస్తున్నాయని అంటున్నారు. తాను పూర్తిగా స్పృహలో ఉండి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొంది. ఈ పదాన్ని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లలోనూ, న్యాయస్థానాల్లోనూ మాత్రమే వాడుతారు.












Click it and Unblock the Notifications